జిల్లాలో అర్హులైన రైతులందరికీ మైక్రోఇరిగేషన్ పరికరాలు అందిచాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా సంబంధిత కంపెనీలకు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయా కంపెనీల ప్రతినిధులతో ప్రకాశం భవనంలో ఆమె ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో సూక్ష్మ సేద్యం తీరు, పరికరాల కోసం ఆసక్తి చూపుతున్న రైతుల వివరాలను ఏ.పి.ఎం.ఐ.పి. పి.డి. శ్రీ పి.వి.రమణ ఈ సందర్భంగా కలెక్టర్ కు వివరించారు. ఇప్పటివరకు 24 వేల మంది రైతులు మైక్రో ఇరిగేషన్ పరికరాల కోసం నమోదు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం అందించే రాయితీ పోనూ తమ వాటా డబ్బులను చెల్లించిన రైతులకు సంబంధించిన 2006 హెక్టార్లకు మైక్రోఇరిగేషన్ పరికరాలు సమకూర్చేలా సంబంధిత కంపెనీలకు అనుమతి ఇచ్చామని చెప్పారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఆసక్తి చూపుతున్న రైతులందరూ త్వరగా తమ వాటా డబ్బులను చెల్లించేలా చూడాలని ప్రాజెక్ట్ డైరెక్టర్ ను ఆదేశించారు. తద్వారా పరిపాలనా పరమైన అనుమతులు త్వరగా ఇస్తానని ఆమె చెప్పారు. ప్రధానంగా మైక్రోఇరిగేషన్ సాగుకు ఎక్కువ అవకాశం ఉన్న జిల్లాలోని పశ్చిమ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. అదేవిధంగా మైక్రో ఇరిగేషన్ పరికరాలు సరఫరా చేసే కంపెనీలు కూడా రైతులకు నాణ్యమైనవి సమకూర్చాలని, సకాలంలో రైతులకు వాటిని అందించడంతోపాటు తదనంతరం అవసరమైన సేవలను కూడా జాప్యం లేకుండా అందించాలని కలెక్టర్ సూచించారు. ఈ ప్రక్రియలో ఏమైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని ఆమె చెప్పారు.

