సీనియర్ ఐఏఎస్ అధికారి, జోనల్ స్పెషల్ ఆఫీసర్ ఆర్.పీ. సిసోడియా గురువారం ఒంగోలులో పర్యటించారు. పోతురాజు కాలువ పరిసరాలలో మున్సిపల్ అధికారులు నిర్వహిస్తున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు చేపట్టామని, రోడ్ల పైన, ఇళ్లలోనూ పేరుకుపోయిన బురదను తొలగించేందుకు ఫైర్ ఇంజన్లతో కడిగిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా ఆయనకు వివరించారు. ఈ పర్యటనలో సిసోరియా వెంట కలెక్టర్ పి.రాజాబాబు, జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ, ఇతర అధికారులు ఉన్నారు. అనంతరం కలెక్టర్, జాయింట్ కలెక్టర్లతో సిసోరియా ప్రత్యేకంగా పరిస్థితిపై ప్రకాశం భవనంలో సమీక్షించారు. వర్షాలు తగ్గినందున పారిశుద్ధ్య పనులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు.


