కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ( కే.పీ.ఐ ), జీరో పావర్టీ ( పీ – 4 )లపై మరింత దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు
అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల జిల్లా అధికారులు, నియోజకవర్గాల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, నియోజకవర్గ విజనరీ ప్లానింగ్ సభ్యులతో గురువారం కలెక్టరేట్లో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారుల వ్యక్తిగత పనితీరుకు వివిధ అంశాలలో సాధించిన పురోగతిని తెలిపే కేపీఐ ప్రతిబింబాలుగా ఉంటాయన్నారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు కేపిఐలతో పాటు జీరో పావర్టీ పథకం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ దృష్ట్యా ప్రతి ఉన్నతాధికారి తమకు సంబంధించిన ఇండికేటర్లపై నిరంతరం దృష్టి సారించాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. ప్రతినెలా పదవ తేదీతో డేటా ఎంట్రీ ఫ్రీజ్ అవుతుంది కాబట్టి సంబంధిత వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో నమోదు చేయాలన్నారు. ఆయా విషయాలపై సిబ్బందికి అవగాహన కల్పించేలా ఒక శిక్షణా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ స్థాయిలో రూపొందించిన విజన్ యాక్షన్ ప్లాన్ ను జిల్లాస్థాయి ప్రణాళికతో సమన్వయం చేస్తూ అమలు చేసేలా అధికారులు పనిచేయాలన్నారు.
అదేవిధంగా పీ – 4 పథకం అమలుపైనా
ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ చెప్పారు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టినందున ‘ బంగారు కుటుంబా’ల అవసరతలను గుర్తించి వాటికి అండగా నిలిచేలా ‘ మార్గదర్శు’లను అనుసంధానం చేయాలన్నారు. మార్గదర్శలను గుర్తించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ చెప్పారు. స్థానిక వనరులను సమర్ధంగా వినియోగించుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో కందుకూరు సబ్ కలెక్టర్ డి.హిమవంశీ, సిపిఓ సుధాకర్ రెడ్డి, ఒంగోలు ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.



