ఈనెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు
ఆదేశించారు. ఈ దిశగా అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు సంబంధిత అధికారులతో శుక్రవారం ప్రకాశం భవనంలోని తన చాంబర్ లో
ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాస్థాయిలో 3000 మందితో, నియోజకవర్గస్థాయిలో 500 మందితో ఈ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చినందున నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలన్నారు. వివిధ రంగాలలో విజయం సాధించిన మహిళలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయడంతో పాటు వారి విజయాలను వీడియో రూపంలో చిత్రీకరించి ఆయా కార్యక్రమాల్లో ప్రదర్శించే ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్రస్థాయిలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తారని, దానిని ప్రత్యక్షంగా ఈ కార్యక్రమాలలో పాల్గొన్న వారు కూడా వీక్షించే సౌకర్యం కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాల నుంచి కూడా రాష్ట్రస్థాయి కార్యక్రమంలో పాల్గొనేందుకు మహిళలను తీసుకువెళ్లేందుకు అవసరమైన బస్సులను కేటాయించాలని చెప్పారు. వీరి రవాణాతో పాటు నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే కార్యక్రమాలు విజయవంతమయ్యేలా నోడల్ ఆఫీసర్లను కేటాయించాలని చెప్పారు. జిల్లాస్థాయిలో నిర్వహించే కార్యక్రమంలో మంత్రులు పాల్గొంటారని, నియోజకవర్గ స్థాయిలో స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ బి.చిన ఓబులేసు, డిఆర్డిఏ పిడి నారాయణ, మెప్మా పీడీ ఆనంద్ సత్యపాల్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, ఏపీఎంఐపి పిడి శ్రీనివాసులు, డిఎంహెచ్ ఓ వెంకటేశ్వర్లు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, ఒంగోలు ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు, ఎల్.డి.ఎం. రమేష్, ఐసిడిఎస్ పిడి నాగమణి, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రాజరాజేశ్వరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


