సామాజిక బాధ్యతగా ప్రజలకు రోటరీ క్లబ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. సోమవారం కొండపి మండలం ఎస్సీ కాలనీలో రోటరీ క్లబ్ జూబ్లీహిల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆర్వో వాటర్ ప్లాంట్ ను మంత్రి డా.స్వామి ప్రారంభించారు. అనంతరం కొండపి మండలంలోని అన్ని పంచాయతీ కార్యాలయాలకు దివ్యాంగులు, వృద్ధులకు సహాయంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వీల్ చైర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ… రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రజలకు అందిస్తున్న సామాజిక సేవలు అభినందనీయం. విద్య, వైద్య రంగాలలో పేద ప్రజలకు తోడ్పాటునందిస్తూ వారికి సాయంగా రోటరీ క్లబ్ నిలుస్తోంది. వైద్య రంగంలో వివిధ వ్యాధులతో పాటు క్యాన్సర్ ని గుర్తించి నివారించేందుకు రోటరీ క్లబ్ పేదలకు సాయం చేస్తోంది. నేడు ప్రారంభించిన వాటర్ ప్లాంట్ తో పాటు కొండపి మండలంలో మరిన్ని గ్రామాలకు ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు రోటరీ క్లబ్ ముందుకు రావడం శుభపరిణామం. ప్రజలకు సేవలందిస్తున్న రోటరీ క్లబ్ కి కొండపి నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు.


