హైదరాబాద్ ఆగస్ట్ 13
(జే ఎస్ డి ఎం న్యూస్) :
నెక్లెస్ రోటరీ సమీపంలోని లేక్ వ్యూ పార్క్ వద్ద ఈ
నెల 14న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగనున్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన ట్రాఫిక్ ఏర్పాట్లను పోలీసులు ముమ్మరం చేశారు. హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు గురువారం (ఆగస్టు 13) ట్రాఫిక్-1 డీసీపీ అవినాష్ కుమార్ స్వయంగా లేక్ వ్యూ పార్క్ను సందర్శించి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను సమీక్షించారు.ఈ పరిశీలన కార్యక్రమంలో డీసీపీతో పాటు ట్రాఫిక్-1 అదనపు డీసీపీ ఎ. రాములు, ఖైరతాబాద్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ ఎస్. మోహన్ కుమార్ పాల్గొన్నారు. అధికారులు వేదికతో పాటు దాని పరిసర ప్రాంతాలను నిశితంగా తనిఖీ చేశారు.
విగ్రహావిష్కరణ మహోత్సవ సమయాల్లో సామాన్య ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో వాహనాల రాకపోకలు సునాయాసంగా సాగేలా ట్రాఫిక్ మళ్లింపు (డైవర్షన్) ప్రణాళికలు రూపొందించారు. పార్కింగ్ నిర్వహణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం అదనపు సిబ్బందిని కేటాయించడమే కాకుండా, క్షేత్రస్థాయి అధికారులకు డీసీపీ సవివరమైన ఆదేశాలు జారీ చేసినట్లు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ కార్యాలయం తెలిపింది.

