మీచాంగ్ తుఫాన్ నేపథ్యంలో ఒంగోలు నగర ఆర్టీసి డిపో ప్రక్క వీధిలో, మంగమూరు డొంకలో, బత్తులవారి గుంట తదితర పరిసరాలలో నగరం చుట్టూ ఉన్న 55 స్లమ్ కాలనీలలో నివసిస్తున్న వారు, కాలువల పక్కన సరియైన ఆవాసం లేక, చిన్నచిన్న వస్తువులను అమ్ముకొంటూ, గంగిరెద్దులను పోషించుకొంటూ జీవితం గడపుచున్న సంచారజాతుల కుటుంబాలను గమనిస్తుంటే అయ్యో అనిపించక మానదు. రోడ్డుపక్కన గుడిసెలు (ప్లాస్టిక్ ఫ్లెక్సీలతో ఏర్పాటు చేసుకొన్న గుడారాలు), కరెంటు లేక చీకటిలో పసిబిడ్డలతో అల్లాడుచున్న పరిస్థితి గమనిస్తూ ఉన్నాము. నగరంలోని ఎందరో ధనవంతులు అదే వైపు రోజూ వందల మంది వెళుచూ ఉన్నారు. వీరికి చేయి అందించి సాయం చేయాలని అటు ప్రభుత్వాధికారులకు ఇటు రాజకీయ నాయకులకు లేకపోవడం ఒకింత బాధాకరం. వారూ సమాజంలో ఒక భాగమేనని గుర్తించాలని ధనిశెట్టి రామునాయుడు విజ్ఞప్తి చేశారు.
ఈ కుటుంబాలను ఆదుకోవడానికి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పాలక, ప్రతిపక్ష మరియు వివిధ పార్టీల నుండి టికెట్ ఆశిస్తున్న ఆశావహులు కాసంత పెద్దమనసు చేసుకొని సొంత నిధులను ఖర్చుపెట్టి అయినా వీరికి సరియైన వసతి ఈ తుఫాన్ సమయంలో చేయాలని మనవి చేస్తున్నాం. అంతేకాకుండా సామాజిక సేవా సంస్థలు నగరంలో ఎన్నో ఉన్నాయి వారు కూడా ఈ తుఫాన్ పరిస్థితి నుండి సంచార జాతుల కుటుంబాలను సంరక్షించే విధంగా పాటుపడాలని కోరుచున్నాము. ఎవరికి వీలుని బట్టి వారు ప్లాస్టిక్ పరదాలు, ఆహారం, చలి నుండి శరీరం కాసుకోవటానికి దుప్పట్లు, లాంతర్లు టార్చ్ లైట్లు, పశుగ్రాసం పంపిణీ చేయాలని ప్రార్థిస్తున్నాం.
ఎవరైతే ముందుండి ప్రజల సాధక బాధలు తెలుసుకొని సహాయ సహకారాలు చేయగలుగుతారో వారికి తప్పనిసరిగా ఆ సహాయం మరో రూపంలో తిరిగి లభిస్తుందని/ అందుతుందని గుర్తు చేస్తున్నామంటూ భారతీయ జనతా పార్టీ మీడియా ఇన్చార్జి ధనిశెట్టి రామానాయుడు పేర్కొన్నారు.
