ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడం తన నిరంతర కర్తవ్యమని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం బేగంపేట డివిజన్ లోని మోతీ నగర్ లో వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్బంగా కాలనీ వాసులు పలు సమస్యలను MLA దృష్టికి తీసుకురాగా, పరిష్కారానికి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రధానంగా మెయిన్ రోడ్ నుండి కాలనీలోకి వెళ్ళే రోడ్డులో పలువురు రోడ్డును ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారని పిర్యాదు చేశారు. అదేవిధంగా వ్యాపారులు రోడ్లపై వాహనాలను నిలుపుతున్న కారణంగా తాము రాకపోకలు సాగించాలంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ కు వివరించారు. వెంటనే ఆక్రమణలను తొలగించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. కాలనీలో రోడ్లపై అక్రమంగా నిలుపుదల చేస్తున్న ఇతర ప్రాంతాలకు చెందిన వారి వాహనాలను కూడా తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. అనంతరం కాలనీలోని పార్క్ లో తిరిగి పరిశీలించారు. పార్క్ లో కాలనీ వాసుల సౌకర్యార్ధం ఒక స్టోర్ రూమ్ నిర్మాణానికి, నూతన పాత్ వే ల నిర్మాణం, గ్రీనరీ పెంపుదల, ఇతర సౌకర్యాల కల్పన కోసం వెంటనే ప్రతిపాదనలను సిద్దం చేయాలని హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు. తాను నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ టి.మహేశ్వరి, వాటర్ వర్క్స్ CGM ప్రభు, DGM శశాంక్, GHMC DE సంతోష్, హార్టికల్చర్ అధికారి జోయాబ్, మోతీనగర్ అద్యక్ష, కార్యదర్శులు గౌర శ్రీనివాస్, విశాల్, శ్రీశైలం, BRS పార్టీ అద్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు శ్రీహరి, శేఖర్, మోహిన్, అజ్మత్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.


