ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సనత్ నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి బన్సీలాల్ పేట డివిజన్ లోని బండ మైసమ్మ నగర్ డి క్లాస్ లో 71 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన సి సి రోడ్ల నిర్మాణ పనులు పరిశీలించారు. నాణ్యత తో త్వరితగతిన పనులు పూర్తి చేసేలా పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. పనులు పూర్తయ్యే వరకు బస్తీ ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు అధికంగా నివసించే బండ మైసమ్మ నగర్ ను అభివృద్ధి లో ఆదర్శంగా తీర్చాలనే ఉద్దేశం తోనే డ్రైనేజీ, వాటర్ లైన్ లు ఏర్పాటు చేయగా, రోడ్ల నిర్మాణ పనులు చేపట్టినట్లు వివరించారు. అంతేకాకుండా స్థానిక ప్రజల అవసరాల కోసం కమ్యూనిటీ హాల్ ను కూడా నిర్మించినట్లు తెలిపారు.
*మల్టి పర్ఫస్ హాల్ నిర్వహణపై అసంతృప్తి*
నగరంలో నే మొట్ట మొదట గా నిర్మించిన బన్సీలాల్ పేట డివిజన్ లోని మల్టి పర్ఫస్ ఫంక్షన్ హాల్ నిర్వహణ తీరు పట్ల సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఆయన దృష్టికి స్థానికులు పలు ఫిర్యాదులు తీసుకొచ్చారు. నిర్వహణ సక్రమంగా లేకపోవడం వలన ఫంక్షన్ హాల్ ను తీసుకున్న వారు అనేక అవస్థలు పడాల్సి వస్తుందని చెప్పారు. లైట్లు సక్రమంగా వెలగకపోవడం, టాయిలెట్స్ ల నుండి దుర్వాసన రావడం పట్ల ఎమ్మెల్యే అధికారులను ప్రశ్నించారు. వెంటనే అన్ని సమస్యలు పరిష్కరించాలని, ఫంక్షన్ హాల్ ను సక్రమంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుభకార్యాల నిర్వహణ కోసం ప్రయివేట్ ఫంక్షన్ హాల్స్ లకు లక్షలాది రూపాయలు ఖర్చు చేయలేక పేదలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మొట్ట మొదటి మల్టి పర్ఫస్ ఫంక్షన్ హాల్ ను జీ హెచ్ ఎం సి ఆధ్వర్యంలో బోయగూడ లో నిర్మించినట్లు వివరించారు. పేదలకు అందుబాటులో ఉండే విధంగా నామమాత్రపు ధరకే ఫంక్షన్ హాల్ ను కేటాయిస్తు వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాకుండా ఫంక్షన్ హాల్ కు కావాల్సిన సామాగ్రీ అంతా తానే ఉచితంగా అందజేసినట్లు చెప్పారు. ఫంక్షన్ హాల్ నిర్వహణ, పర్యవేక్షణ సరిగా లేని కారణంగా తాను అందజేసిన సామాగ్రి లో కొంత సామాగ్రి కనిపించడం లేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వ వైఖరి, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఫంక్షన్ హాల్ నిర్మాణం లక్ష్యం నెరవేరకుండా పోతుందని అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్మ హేమలత, డి సి సమ్మయ్య, ఈ ఈ సుదర్శన్, టౌన్ ప్లానింగ్ ఏ సి పి సుష్మిత, ఎలెక్ట్రికల్ ఏ డి ఈ దుర్గా ప్రసాద్, వాటర్ వర్క్స్ డి జీ ఎం ఆశిష్, శానిటేషన్ డి ఈ దేవేందర్ రెడ్డి, బి ఆర్ ఎస్ డివిజన్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు లక్ష్మీపతి, ప్రేమ్, ఫహీం తదితరులు ఉన్నారు.





