హైదరాబాద్ మే 3 (జే ఎస్ డి ఎం న్యూస్) :
అంబర్ పేట ఫ్లైఓవర్ అభివృద్ధి పనులలో నిర్లక్ష్యంపై కేంద్రమంత్రి గంగాపురం కిషన్ రెడ్డి అధికారులపై మండిపడ్డారు.
రూ. 415 కోట్ల వ్యయంతో నిర్మించిన అంబర్పేట్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం మే 5న జరగనున్న సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం ఫ్లైఓవర్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా ఫ్లైఓవర్ కింద జరగాల్సిన రోడ్ల విస్తరణ, ప్లాంటేషన్, గ్రీనరీ డెవలప్ మెంట్ వంటి అభివృద్ధి పనులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, సంబంధిత అధికారులపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తైనప్పటికీ, దాని కింద భాగంలో ప్లాంటేషన్, గ్రీనరీ అభివృద్ధి, రోడ్ల నిర్మాణం వంటి కీలకపనులుపూర్తికాకపోవడాన్ని మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు.అధికారులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.ఈ సందర్బంగా నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కృష్ణప్రసాద్, ఆర్ అండ్ బి సూపరింటెండింగ్ ఇంజినీర్ ధర్మారెడ్డి, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ రవికిరణ్, అడిషనల్ డీసీపీ నర్సయ్యలపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ సేకరణ బాధ్యతను మోస్తున్న జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆయన మండిపడ్డారు.
ఎంక్రోచ్మెంట్ నియంత్రణపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఫ్లైఓవర్ కింద పార్కింగ్ ఏర్పాటు చేసినప్పటికీ, ప్లాంటేషన్ లేకపోవడం, గ్రీనరీ అభివృద్ధి జరగకపోవడం, అలాగే అది ఎంక్రోచ్ కాకుండా జాలీ ఏర్పాటు చేయాల్సిన పనులు పూర్తికాకపోవడం పై కేంద్రమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు మతపరమైన నిర్మాణాల కారణంగా అడ్డంకులు ఉన్నట్లు చెబుతున్నప్పటికీ, వాస్తవంగా అక్కడ అలాంటి సమస్యలు లేవని స్థానికులు తెలిపారు. దీంతో అధికారుల నిర్లక్ష్యం, పోలీసు యంత్రాంగం రక్షణ కల్పించడంలో వైఫల్యం చెందడాన్ని కిషన్ రెడ్డి తప్పుబట్టారు.
ప్రారంభానికి ముందు ఒత్తిడిలో అధికారులు.
ఇప్పటికే ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి తేదీ ఖరారవడంతో, కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మే 5న కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో, పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయకపోవడంతో అధికార యంత్రాంగంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా తీసుకోవాలి….
ఈ ఘటన నేపథ్యంలో, ఫ్లైఓవర్ కింది భాగాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి, ప్రజలు, ప్రయాణికులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. “నిధులు ఇచ్చిన తర్వాత పనిచేయకపోతే ప్రజలకు సమాధానం చెప్పేది ఎవరు?” అనే ప్రశ్నను అధికారుల ముందుంచారు. తక్షణమే పెండింగ్ పనులను పూర్తిచేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.అధికారులు రాత్రికి రాత్రే పెండింగ్లో ఉన్న పనులను పూర్తిచేస్తామని సమాధానం చెప్పినప్పటికీ, ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ ముహూర్తం దగ్గరపడటంతో అప్పటికప్పుడే పనులను పూర్తి చేయడం సాధ్యమవుతుందా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

