జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో టాయిలెట్లు, త్రాగునీరు, ఇతర మౌలిక వసతుల కల్పనపై తక్షణమే దృష్టి సారించాలని కలెక్టర్ పి.రాజాబాబు స్పష్టం చేశారు. శనివారం ఆయన అధ్యక్షతన ప్రకాశం భవనంలో జిల్లాస్థాయి తాగునీరు, పారిశుధ్య కమిటీ సమావేశం జరిగింది. జలజీవన్ మిషన్ పథకం కింద జిల్లాలో చేపట్టిన పనుల పురోగతిపై ఆరా తీశారు. ఈ క్రమంలో పాఠశాలలు, కళాశాలలో త్రాగునీరు, టాయిలెట్లు, ఇతర పారిశుద్ధ్య సదుపాయాలపై ప్రత్యేకంగా చర్చించారు. మరమ్మతులు, ఇతర నిర్వహణ పనులు చేపట్టాల్సిన అవసరం ఉంటే
పాఠశాలలు పునః ప్రారంభమయ్యేలోపు వీటిని పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ విషయంలో సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆయన ఆదేశించారు. గ్రామపంచాయతీ, సి.ఎస్.ఆర్. నిధులతోపాటు దాతల సహాయం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో ఆర్.డబ్ల్యు.ఎస్. ఎస్.ఈ. నాగేశ్వరరావు, డిపిఓ వెంకటేశ్వరరావు, డి.ఆర్.డి.ఏ. పి.డి. నారాయణ, గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, జడ్పీ సీఈవో చిరంజీవి, ఏపీ సిపిడిసిఎల్ ఎస్.ఈ. వెంకటేశ్వర్లు, డీఈవో రేణుక, డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

