ప్రముఖ గ్రానైట్ పారిశ్రామికవేత్త, మాజీ మంత్రి శిద్దా రాఘవరావుకు అమెరికాలోని మేరీల్యాండ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించింది.
సమాజ సేవ, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ, బిజినెస్ మేనేజ్మెంట్ రంగాల్లో ఆయన అందిస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా ఈ బిరుదును ప్రదానం చేసినట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సోఫియా నుబాని, ఛాన్సలర్ డా. జాన్ ఎన్. కలరస్ సంయుక్తంగా ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఆదివారం ఒంగోలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో డాక్టరేట్ అందుకున్న శిద్దా రాఘవరావును పలువురు ప్రముఖులు శాలువాతో సత్కరించారు.
అనంతరం శిద్దా రాఘవరావు మాట్లాడుతూ .. .. “యూనివర్సిటీ ప్రతినిధులకు కృతజ్ఞతలు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని , లయన్స్ క్లబ్ ద్వారానే నాకు విశేష గుర్తింపు వచ్చిందని, మానవ సేవే మాధవ సేవ అని నిస్వార్థంగా చేసే సేవలే గుర్తింపు తెస్తాయని అన్నారు . ఈ డాక్టరేట్ నా బాధ్యతను మరింత పెంచింద ని చెప్పారు . మీ అందరి సహకారంతో మరిన్ని సేవలు అందిస్తాను” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పీఎంజేఎఫ్ ఎం. ఉపేంద్ర, అంబటి సుధాకర్ రెడ్డి, డా. జవహర్, డి. శాంతి, హరి ప్రసాద రావు, ఆర్. లక్ష్మీనారాయణ, డా. వై. గాంధీ, పి. విజయ కుమార్ రెడ్డి, నామినేని మెహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

