సి.ఆర్.మీడియా అకాడమీ, నాగార్జున యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న “జర్నలిజంలో డిప్లమో కోర్సు”కు దరఖాస్తు గడువును సెప్టెంబర్ 5 వరకు పొడిగించినట్లు మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ ఆగస్టు 20న ఒక ప్రకటనలో తెలిపారు. కోర్సు పట్ల వివిధ వర్గాల నుండి వస్తున్న విచారణలు, డిమాండ్ దృష్ట్యా మరియు జర్నలిస్టు సంఘాలు, పాత్రికేయుల విజ్ఞప్తి మేరకు గడువును పొడిగించామని ఆయన తెలిపారు.
ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకునే జర్నలిస్టులు రూ.2 వేలు, ఇతర అభ్యర్థులు రూ.2 వేల 500 కోర్సు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఫీజును సెక్రెటరీ, సి.ఆర్. మీడియా అకాడమీ పేరున ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది.
జర్నలిస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత, జర్నలిజంలో అభిరుచి కలిగిన ఇతర అభ్యర్థులకు డిగ్రీ ఉత్తీర్ణత అర్హతగా నిర్ణయించారు.