ప్రకాశం: ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పధకం కింద కొండపి నియోజకవర్గానికి మంజూరైన ఇళ్ల లబ్ధిదారులకు త్వరలో మంజూరు పత్రాలు అందజేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం తూర్పు నాయుడుపాలెం క్యాంప్ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పధకం కింద కొండపి నియోజకవర్గానికి మంజూరైన 229 ఇళ్ళ లబ్ధిదారులకు త్వరలో మంజూరు పత్రాలు అందజేసేలా చర్యలు చేపట్టాలన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి అనంతరం కొండపి నియోజకవర్గానికి మరో 140 ఇల్లు మంజూరు అవుతాయని మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం కింద ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 1 లక్ష మొత్తం రూ. 2.50 లక్షలు సబ్సిడీ కింద అందజేస్తాయని తెలిపారు. ఇంటి నిర్మాణంలో భాగంగా వీజీబీరామ్ జీ పధకం కింద 90 పని దినాలకు వేతన రూపంలో రూ. 27 వేలు, స్వచ్ఛభారత్ నిధుల కింద మరో రూ. 12 వేలు లబ్ధిదారులకు అదనంగా వస్తాయని తెలిపారు. పేదలను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు.

