రైతులకు అండగా ఉంటూ వ్యవసాయాన్ని పండగ చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే దక్కిందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. రైతు భరోసా- పీఎం కిసాన్ పథకంలో భాగంగా రైతు ఖాతాల్లోకి నగదు జమ చేసే జిల్లా స్థాయి కార్యక్రమాన్ని యర్రగొండపాలెం అంబేడ్కర్ ఆడిటోయంలో మంగళ వారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాల సరఫరాతో పాటు క్షేత్రస్థాయిలో అన్ని సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతు భరోసా- పీఎం కిసాన్ పథకం ద్వారా జిల్లాలోని 2,95,114 రైతు కుటుంబాలకు రూ.122.03 కోట్ల మేర లబ్ధి చేకూరు తున్నట్లు వివరించారు. మంత్రి సురేష్ మాట్లాడుతూ.. వెలిగొండ ప్రాజెక్టు నుంచి డిసెంబర్ నాటికి నీరు సరఫరా చేస్తామని చెప్పారు. నిర్వాసితులకు రూ.800 కోట్ల మేర నష్టపరిహారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ. ఈ నగదును వ్యవసాయ ఖర్చులకు వినియోగించుకోవాలని రైతు లకు సూచించారు. అనంతరం రైతులకు చెక్కు పంపిణీ చేశారు.కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు బూచేపల్లి వెంకాయమ్మ, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, ఉద్యాన శాఖ అధికారి గోపీచంద్, ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ రమణ, ఆత్మ పీడీ అన్నపూర్ణ, ప్రకృతి సేద్యం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ సుభాషిణి, డీఎల్ సాయికుమార్, ఎంపీపీ కిరణ్ గౌడ్, జడ్పీటీసీ సభ్యుడు చేదూరి విజయభాస్కర్, సర్పంచి అరుణాబాయి, వైకాపా నాయకులు మూర్తి రెడ్డి, ఓబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

