జర్నలిస్టుల ఇళ్ల స్థలాల భూసేకరణకు అవసరమైన బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం రెండు, మూడు రోజుల్లో విడుదల చేయనున్నట్టు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంవో అధికారులు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించామన్నారు. ఇళ్ల స్థలాలకు సంబంధించిన భూసేకరణ సమయంలో జర్నలిస్టుల అభిప్రాయాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారన్నారు. ఇప్పటి వరకు జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం 10,017 దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రాథ మిక పరిశీలన అనంతరం 7,651 మంది అర్హులైన జర్నలిస్టుల జాబితాను తదుపరి వెరిఫికేషన్ కోసం 26 జిల్లాల కలెక్టర్లకు పంపించామని చెప్పారు. అసంపూర్తిగా ఉన్న 766 మంది జర్నలిస్టుల దరఖాస్తులను సరిదిద్దుకునేందుకు మరో అవకాశం కల్పించామన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలం కేటాయించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు.
రెండు సెట్లు ఒంగోలు కార్యాలయంలో అందజేయండి – డిపిఆర్ఓ దుర్గాప్రసాద్
ఇళ్ళ స్థలాల కోసం ఆన్ లైన్ లో సమర్పించిన దరఖాస్తులను సమాచార పౌర సంబంధాల శాఖ రాష్ట్ర కార్యాలయ ఉన్నతాధికారులు పరిశీలించడం జరిగిందని పాత్రికేయ వృత్తిపరంగా తగిన అర్హత ఉన్నట్లు నిర్ధారించి, ఇంటి స్థలం పొందడానికి ప్రాథమికంగా అర్హత ఉన్నట్లు గుర్తించి, మీ ఆన్ లైన్ దరఖాస్తులను సమాచార పౌర సంబంధాల శాఖ ప్రకాశం జిల్లా కార్యాలయానికి బదిలీ చేయడం జరిగిందని డిపిఆర్ఓ దుర్గాప్రసాద్ తెలిపారు. సంబంధిత దరఖాస్తుకు ఆధార్ కార్డు కాపీ, భార్య ఆధార్ కార్డు కాపీ జత చేసి రెండు సెట్లు డిపిఆర్ఓ కార్యాలయానికి త్వరగా అందజేయాలని కోరారు.