నాలుగు దశాబ్ధాలుగా ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై గత ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసు బనాయించి 53 రోజుల పాటు జైలులో పెట్టిందని, అందువల్లే జగన్ను ప్రజలు ఛీకొట్టి ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిరచి ఇంటికి పంపించారని జిల్లా టీడీపీ అధ్యక్షులు, మాజీ జెడ్పీ చైర్మన్ డా.నూకసాని బాలాజీ* అన్నారు.
సోమవారం ఒంగోలులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ను ఏర్పాటుచేసి ఎంతో మందికి శిక్షణ ఇప్పించారని, దీనివల్ల రెండు లక్షల మంది యువత వివిధ ఉద్యోగాల్లో స్థిరపడ్డారని తెలిపారు.
చంద్రబాబు ఏ తప్పు చేయకపోయినా కేసుపెట్టి అక్రమంగా అరెస్టు చేసి జగన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర ప్రజలందరూ రోడ్లపైకి వచ్చారని తెలిపారు. 70 దేశాలలో నివసిస్తున్న తెలుగు ప్రజలు నిరసనలు తెలిపారని గుర్తుచేశారు. జగన్రెడ్డి అవినీతి, అక్రమాలను ప్రశ్నించినందుకే చంద్రబాబును, టీడీపీని భయభ్రాంతులకు గురిచేయడానికి ప్రయత్నించాడని, అయినా సరే ఎవరూ భయపడకుండా పోరాటం చేశారన్నారు.
చంద్రబాబును జైలులో పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ 53 రోజుల పాటు ప్రజలు రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు, వివిధ రకాల ఆందోళన చేశారని తెలిపారు. చంద్రబాబు అరెస్టును దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఖండిరచాయన్నారు. స్కిల్ కేసులో మొదట రూ.3వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పారని, ఆ తరువాత రూ.300 కోట్లు అన్నారని, మళ్లీ కొద్దిరోజుల తరువాత రూ.30 కోట్లు అన్నారని, చివరకు 3 పైసల అవినీతి జరిగినట్లు కూడా నిరూపించలేకపోయారన్నారు.
చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు సైకో జగన్రెడ్డి కనీస వసతులు కూడా కల్పించలేదని, హైకోర్టు ఆదేశాలతో సౌకర్యాలు కల్పించారన్నారు. నీతి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమైన చంద్రబాబుకు ప్రజలు ఎన్నికల్లో చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారని, తలెత్తుకుని సగౌరవంగా నిలబడేలా చేశారన్నారు. కుట్రలు, కుతంత్రాలకు పాల్పడిన జగన్రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారని తెలిపారు. జగన్ తన అవినీతిని కప్పి పుచ్చుకోవడానికే గత ఐదేళ్లలో చంద్రబాబుపై 12 తప్పుడు కేసులు పెట్టారని, డీఐజీ కొల్లి రఘురామిరెడ్డిని సిట్ అధిపతిగా నియమించి ఫైబర్నెట్, స్కిల్, ఓఆర్ఆర్ కేసుల్లో టీడీపీ నేతలను వేధించారని విమర్శించారు. ఐపీఎస్ అధికారులు రాజ్యాంగం ప్రకారం పనిచేయడకుండా జేపీఎస్ అధికారులుగా పనిచేశారని ఆరోపించారు.
చంద్రబాబు 53 రోజుల తరువాత బెయిల్పై జైలు నుంచి విడుదలైనప్పుడు రాజమండ్రి నుంచి విజయవాడ రావడానికి 12 గంటల సమయం పట్టిందని, ప్రజలు ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చి ఆయనకు స్వాగతం పలికారని తెలిపారు. దేశంలో అరెస్ట్ అయిన ఏ రాజకీయ నేతకూ ప్రజల నుంచి ఇంత పెద్దఎత్తున మద్దతు లభించిన సందర్భాలు లేవన్నారు. చంద్రబాబునాయుడుపై అవినీతి మచ్చ వేయడానికి జగన్ చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావని, 70 ఏళ్ల వయస్సులోనూ ప్రజల కోసం చంద్రబాబు అలుపెరగని పోరాటం చేశారని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాలన సాగిస్తున్నారని, మూడు నెలలు కూడా పూర్తి కాకుండానే రాష్ట్రాభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు. పింఛన్లు రూ.3వేల నుంచి రూ.4వేలకు పెంచారని, రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటుచేశారని, ప్రజల భూములు కొట్టేసేందుకు జగన్రెడ్డి తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దుచేశారని, నిరుద్యోగులకు 16347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించారన్నారు. అలాగే రాజధాని అమరావతి నిర్మాణానికి, రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి భారీగా నిధులు రాబట్టారని చెప్పారు. జగన్ రోత పాలకుడు అయితే చంద్రబాబు ప్రజల తలరాతను మార్చే నాయకుడు అని స్పష్టం చేశారు.
బర్త్ డే వేడుకలు వద్దు.. వరద బాధితులకు సాయం చేద్దాం 10వ తేదీ తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం లేదని నూకసాని బాలాజీ తెలిపారు. వరదలు వచ్చి విజయవాడ ప్రజలు కష్టాల్లో ఉన్నారని, వారికి అన్నివిధాల సాయమందించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజల కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారని, ఆయన స్ఫూర్తితో మనందం ముందుకు సాగుదామని తెలిపారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలనుకునేవారు పూలబొకేలు లాంటివి తీసుకురాకుండా ఆ డబ్బులు వరద బాధితులకు సాయంగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
