బేగంపేట, డిసెంబర్ 25, జె ఎస్ డి ఎం న్యూస్ : తాగునీరు పట్టుకునే ప్రయత్నం లో ఓ మహిళ నిండు ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటన బేగంపేట్ పోలీస్ స్టేషన్ ఎన్ బి టి నగర్ లో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బేగంపేట ఎన్ బి టి నగర్. ఎఫ్ బ్లాక్ లో సి. విగ్నేష్ అన్నపూర్ణ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి శివాని (13) త్రిష (6) కుమార్తెలున్నారు. సోమవారం ఉదయం నల్ల నీరు లో ప్రెజర్ తో వస్తుండటంతో తాము నివసించే భవనం కింద గ్రౌండ్ ఫ్లోర్ వద్ద నీటిని తోడేందుకు అన్నపూర్ణ (42)మోటార్ ను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. దాని ద్వారా నీటిని పట్టుకున్నారు.అనంతరం మోటారును తొలగించే క్రమంలో పొరపాటున మోటారుకు వున్న ప్లగ్ ను తొలగించి మోటారుకు విద్యుత్ సరఫరా అవుతున్న ప్లగ్ ను మర్చిపోయిన అన్నపూర్ణ తీగను తీసే క్రమంలో విద్యుదాఘాతానికి గురైంది. ఇది గమనించిన వారు వెంటనే ఆమెను మెరుగైన వైద్య చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అన్నపూర్ణను పరిశీలించిన డాక్టర్లు ఆమె అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. సంఘటన గురించి తెలుసుకున్న బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ భర్త విగ్నేష్ మాట్లాడుతూ తాగునీటి సరఫరా సక్రమంగా రావడం లేదని, కొద్ది సమయం మాత్రమే వస్తుండటంతో కింద ఉన్న పంపుకు తాత్కాలికంగా మోటార్ ను ఏర్పాటు చేసి నీటిని పైకి తోడుకుంటామని అన్నారు. ఈ క్రమంలో తన భార్య అన్నపూర్ణ విద్యుదాఘాతానికి గురై మరణించడం జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. వాటర్ వర్క్స్ అధికారులు తాగునీటి సరఫరా సక్రమంగా ఇచ్చి ఉంటే తన భార్య ప్రాణాలతో ఉండేదని , వారి నిర్లక్ష్యం కారణంగానే తన భార్య నిండు ప్రాణం పోయిందంటూ విగ్నేష్ ఆరోపించాడు .గడచిన కొన్ని రోజులుగా నీటి సరఫరా సక్రమంగా రావడం లేదని లో ప్రెజర్ తో వస్తుందని అన్నారు. తన భార్య మరణంతో ఇద్దరు కుమార్తె లు తాను దిక్కుతోచని స్థితిలో పడిపోయానని విగ్నేష్ వాపోయాడు. తాను పెయింటింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానని తెలిపారు.ఈ ఘటనపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
