పరమ పవిత్రమైన, హిందూ ధార్మిక కేంద్రం తిరుమలలో శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ మరియు బార్ నిర్మాణం ఒక దుర్మార్గమైన చర్య అంటూ… వెంటనే అనుమతులను రద్దు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుండి వందలాదిమంది సాధుసంతులచే ఎగ్జిక్యూటివ్ అధికారి కార్యాలయం ముంగిట ఫిబ్రవరి 12, 13 రెండు రోజులపాటు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని స్వామి శ్రీనివాసానంద సరస్వతి తెలిపారు.
స్థానిక విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం అయోధ్య భవనంలో మంగళవారం ఉదయం తిరుపతి తిరుమల బయలుదేరిన సాధుసంతులచే సమావేశ కార్యక్రమం విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు తూనుగుంట మల్లికార్జున రావు అధ్యక్షతన జరిగినది. ఈ సందర్భంగా స్వామి శ్రీనివాసానంద సరస్వతి మాట్లాడుతూ మన పరమ పవిత్రమైన తిరుమల శ్రీవారి దేవస్థానం పాదాల చెంత అన్యమతస్తులకు ముంతాజ్ హోటల్ పేరిట బార్ అండ్ రెస్టారెంట్ ను అనుమతి ఇవ్వడం హిందూ బంధువులందరూ ఖండించవలసిన విషయమని, ఈరోజు ఈ నిర్మాణాన్ని నిలుపుదల చేయకపోతే భవిష్యత్తులో ఇతర మతస్తులకు అనేక నిర్మాణాలకు అనుమతులను మంజూరు చేయవలసి వస్తుందని కనుక ఆలయ పవిత్రతను, క్షేత్ర పవిత్రతను కాపాడవలసిన బాధ్యత అటు ప్రభుత్వంపైన ఇటు హిందూ సమాజం పైన ఉందని తెలిపారు. ఫిబ్రవరి 12 13 తేదీల్లో తిరుమలలో ఈవో కార్యాలయం ముందు సాధు పరిషత్ ఆధ్వర్యంలో జరిగే ధర్నా కార్యక్రమానికి హిందూ సమాజం పెద్ద సంఖ్యలో పాల్గొని ముంతాజ్ హోటల్ కు ఇచ్చినటువంటి అనుమతులు రద్దు చేసే వరకు పోరాటం సాగించాల్సిన అవసరం ఉందన్నారు. హోటల్, బార్, రెస్టారెంట్ మరియుాస్పా సెంటర్ తదితర అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే నిర్మాణాలను తక్షణమే నిలుపుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
తిరుమల కొండలు సప్త ఋషుల సంకేత పుణ్య గిరులు.. వారు తపస్సు చేసిన శేషాచల గిరులను, అలాంటి పుణ్య స్థల పవిత్రతను భ్రష్టు పటించి, ఇలాంటి అపవిత్రమైన మతాక్రమణ నిర్మాణాన్ని హిందూ ప్రజలు, హిందూ భక్తులు, టిటిడి పాలక మండలి, హిందూ ధార్మిక సంస్థలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, అందరు కలసి తిరుగుబాటు చేసి అడ్డు కోవలసిన బాధ్యత ఉన్నదని విశ్వ హిందు పరిషత్ ధర్మాచార్య ప్రముఖ సాధు పరిషత్ జిల్లా అధ్యక్షులు త్రిపుర భైరవేశ్వరానంద స్వామి తెలిపారు.
సమావేశంలో విశ్వహిందూ పరిషత్ ప్రాంత సత్సంగ ప్రముఖ్ సోమ సుబ్బారావు, జిల్లా ఉపాధ్యక్షులు జిల్లెలమూడి వెంకటేశ్వర్లు, కార్యదర్శులు ఐ సీతారామయ్య, ఈ బలరాం, గడ్డం శ్రీనివాసులు, నేరెళ్ల శ్రీనివాసులు, సాధు శ్రీనివాస గుప్తా, వేమూరి చక్రధర పెరుమాళ్ళు, ప్రచార ప్రముఖు రాధా రమణ గుప్తా జంధ్యం మరియు స్వామి మురళీకృష్ణ, మహావిద్యానంద మాతాజీ, కరుణానంద స్వామి, శుభోదయానంద స్వామి, స్మరణానంద స్వామి, అన్నపూర్ణ మాతాజీ, దయానంద స్వామి, భారతీయ జనతా పార్టీ జిల్లా నూతన అధ్యక్షులు శెగ్గం శ్రీనివాసరావు మరియు పలువురు స్వామీజీలు పాల్గొన్నారు.




