రాంగోపాల్పేట్ జూలై 20( జె ఎస్ డి ఎం న్యూస్) :
మోండా డివిజన్ పరిధి లోని సెకండ్ బజార్లో తాగునీటి సరఫరా లో ప్రెషర్ తో సరఫరా అవుతున్నాయి. గత కొద్ది నెలల నుంచి ఇలాగే మంచినీళ్లు సరఫరా అవుతుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సెకండ్ బజార్ లోని జైహింద్ బేకరీ ఎదురుగా ఉండే గల్లీలో ఈ పరిస్థితి నెలకొంది. రెండు రోజులకు ఒక మారు రెండు గంటల పాటు మంచినీరు సరఫరా చేస్తారు. అయితే మొదటి గంట మొత్తం కలుషిత జలాలు సరఫరా అవుతుండగా మిగతా గంట లో ప్రెషర్తో నీళ్లు వస్తున్నాయి. ఇటీవల ఇక్కడ బోనాల జాతర సందర్భంగా మంచినీళ్ల కోసం. స్థానికులు బయట ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.
నిర్లక్ష్యానికి నిదర్శనం జలమండలి అధికారులు …
ఈ గల్లీలో గత మూడు నెలల నుంచి ఇలాగే మంచినీరు లోప్రెషర్, కలుషిత జలాలు సరఫరా అవుతుండగా స్థానిక ప్రజలు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఏ ఒక్కరు పట్టించుకోవడం లేదు. సెక్షన్ మేనేజర్తో పాటు మారేడుపల్లి జీఎం వినోద్ దృష్టికి తీసుకుని వెళ్లినా కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా వచ్చి చూసిన పాపాన పోలేదు. ఈ నెల 18వ తేదీ ఆన్లైన్లో ఫిర్యాదు చేయగా 3535 టోకెన్ నంబర్ ఇచ్చారు. అధికారులు కానీ, సిబ్బంది కానీ ఏ ఒక్కరు వచ్చి చూడకుండానే సమస్య పరిష్కారం అయిందని మెసేజ్ రావడంతో జలమండలి పనితీరు ఎలా ఉందో అర్థం చేసికోవచ్చని స్థానికులు విమర్శిస్తున్నారు. కింది స్థాయి అధికారుల నుంచి జీఎం స్థాయి అధికారికి ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ అంటూ మెసేజ్ చేయడం తప్పా ఏ ఒక్క రోజు ఆయన ప్రజల సమస్యల గురించి పట్టించుకోడనే విమర్శలు ఉన్నాయి. అలాగే ఏ రోజు కార్యాలయంలో అందుబాటులో ఉండకపోవడంతో పాటు ఫోన్లకు సమాదానం ఇవ్వరనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పంధించి సెకండ్ బజార్లో లోప్రెషర్, కలుషిత జలాల సమస్య తీర్చాలని స్థానికలు కోరుతున్నారు.
