హైదరాబాద్ సెప్టెంబర్ 30(జే ఎస్ డి ఎం న్యూస్) :
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మంగళ వారం సికింద్రాబాద్ డివిజన్లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ తనిఖీ సమయంలో ఆయనతో పాటు సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్ మరియు ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు.సంజయ్ కుమార్ శ్రీవాస్తవ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ స్టేషన్లో అందుబాటులో ఉన్న ప్రయాణీకుల సౌకర్యాలు మరియు వసతులను సమీక్షించారు. బుకింగ్ కౌంటర్, వెయిటింగ్ రూమ్, స్టేషన్ మాస్టర్ కార్యాలయం మరియు స్టేషన్లోని సర్క్యులేటింగ్ ప్రాంతాన్ని కూడా ఆయన పరిశీలించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా హైటెక్ సిటీ స్టేషన్లో జరుగుతున్న పునరాభివృద్ధి పనుల పురోగతిని కూడా జనరల్ మేనేజర్ పరిశీలించారు. పునరాభివృద్ధి పనుల పురోగతిపై డివిజనల్ అధికారులు వివరణాత్మక నివేదికను సమర్పించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయడానికి పనులను మరింత వేగవంతం చేయాలని జనరల్ మేనేజర్ అధికారులను ఆదేశించారు.



