ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్న రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్
పి.రాజాబాబు స్పష్టం చేశారు. ఆయా రంగాలలో జిల్లాకు సంబంధించిన ప్రగతి మరింత మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సచివాలయం నుంచి మంత్రులు, కార్యదర్శులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం భవనము నుంచి ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజుతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.
జి.ఎస్.డి.పి, 10 సూత్రాలు, ఆదాయార్జన
శాఖల పనితీరు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, పి.పి.పి. సహా పెట్టుబడుల ప్రతిపాదనలు, ఆర్టిజిఎస్, వాట్సప్ గవర్నెన్స్, ప్రభుత్వ పనితీరు – పథకాల అమలుపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తున్న తీరు, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా అందుతున్న సేవలు, నూతన ఉపాధి హామీ పథకం, పారిశుద్ధ్యంపై జిల్లాల వారీగా ముఖ్యమంత్రి సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్ధంగా అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్.ఎస్.ఎం.ఈ. పార్కులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ నెలాఖరు నాటికి ఈ-ఫైల్స్ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని ముఖ్యమంత్రి అన్నారు.
అనంతరం ఈ వీడియో కాన్ఫరెన్స్ లో
పాల్గొన్న జిల్లా అధికారులతో కలెక్టర్ ప్రత్యేకంగా చర్చించారు. జిల్లాలో పారిశుద్ధ్యము, రిజిస్ట్రేషన్లు, ఐసిడిఎస్, ఏపీఎస్ఆర్టీసీ సేవలపై మరింత దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు కేటాయించిన నిధులను మార్చి 15వ తేదీ నాటికి పూర్తిస్థాయిలో వినియోగించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.


