బేగంపేట జనవరి 13
(జే ఎస్ డి ఎం న్యూస్) :
తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పుతూ ప్రజలను మోసం చేస్తున్నారని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. మంగళవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయంలో సనత్ నగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్ నియోజకవర్గాలకు చెందిన కార్పొరేటర్ లు, మాజీ కార్పొరేటర్ లు, మాజీ బోర్డు సభ్యులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సికింద్రాబాద్ జిహెచ్ఎంసి లోనే ఉందని, మల్కాజిగిరి లో కలపలేదని పచ్చి అబద్దాలు చెప్పారని అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని నూతనంగా ఏర్పడ్డ ప్రకాష్ నగర్, మోండా డివిజన్ లను మల్కాజిగిరి జోన్ పరిధిలోని బోయిన్ పల్లి సర్కిల్ లో కలిపిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. అదేవిధంగా సికింద్రాబాద్ ప్రాంతంలోని బేగంపేట, మహంకాళి, గోపాలపురం, కార్ఖానా, బోయిన్ పల్లి, తదితర పలు పోలీస్ స్టేషన్ లను మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి కలిపారని, ఇది సికింద్రాబాద్ ను మల్కాజిగిరి లో కలిపినట్లు కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికే అధికారులు కార్యకలాపాలు చేపట్టారని పేర్కొన్నారు. ఈ నెల 17 వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి నిర్వహించనున్న శాంతి ర్యాలీ అనుమతి కోసం లష్కర్ జిల్లా సాధన సమితి ప్రతినిధులు ఈ నెల 5 వ తేదీన హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో దరఖాస్తు చేస్తే 10 రోజులుగా హైదరాబాద్ కమిషనరేట్ నుండి మల్కాజిగిరి కమిషనరేట్ కు పంపారని, అది తమ పరిధి కాదని అక్కడి నుండి హైదరాబాద్ అదనపు కమిషనర్ కు పంపగా,
రైల్వే స్టేషన్ మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోకి వస్తుందని తిరిగి మల్కాజిగిరి కమిషనర్ ఆఫీస్ కు పంపారని వివరించారు. పోలీసు అధికారులు కూడా తమ పరిధులు ఏమిటో తెలియక అయోమయానికిగురవుతున్నారని చెప్పారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలే కారణం అన్నారు. మన ఆత్మగౌరవం, అస్థిత్వంను దెబ్బతీసేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వంచర్యలుచేపడుతుందని చెప్పారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు కాకపోతే మనకు తీరని నష్టంజరుగుతుందని హెచ్చరించారు. 220 సంవత్సరాల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ పేరు లేకుండా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని తెలిపారు. సికింద్రాబాద్ ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజలు, పలు సంఘాలు స్వచ్చందంగా మద్దతు తెలుపుతున్నాయని అన్నారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఇప్పటికే పలు సంఘాలు మద్దతు తెలపగా, ఈరోజు మేరు సంఘం, ఆటో యూనియన్, విశ్వకర్మ సంఘం తదితర సంఘాల ప్రతినిధులు సమావేశానికి హాజరై సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం చేస్తున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సమావేశంలో లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్, కార్పొరేటర్ లు సామల హేమ, శైలజ, ప్రసన్న, సునీత, మాజీ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, డివిజన్ అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, హన్మంతరావు, శ్రీనివాస్ గౌడ్, వెంకటేషన్ రాజు, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, సభ్యులు పాండు యాదవ్, అనిత ప్రభాకర్, నళిని కిరణ్, లోకనాధం, పలువురు నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


