హైదరాబాద్ ,( జేఎస్ డి.ఎం న్యూస్) :
గల్ఫ్ దేశం ఓమాన్లో మృతి చెందిన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యాంచా గ్రామానికి చెందిన గల్ఫ్ కార్మికుడు గొల్ల అబ్బులు (తొగరి అబ్బయ్య) మృతదేహం తెలంగాణ ప్రభుత్వ ఖర్చులతో ఓమన్ నుంచి గురువారం సాయంత్రం హైదరాబాద్కు చేరింది.
గత నెల డిసెంబర్ 9న ‘ఇబ్రి’ ఎడారిలో మృతి చెందిన అబ్బులు మృతదేహం 52 రోజుల అనంతరం స్వదేశానికి చేరింది. ఓమన్ లో మృతికి సంబంధించిన ల్యాబ్ నివేదిక కోసం ఇరుదేశాల అధికారులు ఎదురుచూస్తున్నారు.
మృత దేహం రవాణా ఖర్చు భరించలేమని ఓమన్ కంపెనీ, భారత ఎంబసీ చేతులెత్తేసిన పరిస్థితుల్లో.రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి సహకారంతో మృతుడి కుటుంబం సీఎం ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించింది. దీనిపై స్పందించిన సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ దివ్యా దేవరాజన్, ఇంఛార్జి డా. జి. చిన్నారెడ్డి లు సీఎం సహాయనిధి నుంచి రూ.1.50 లక్షల చెక్కును మృతుడి భార్య చిన్న సావిత్రికి అందజేసి అండగా నిలిచారు.
ఇండియన్ సోషల్ క్లబ్ తెలంగాణ విభాగం అధ్యక్షులు గుండేటి గణేష్ ఇండియన్ ఎంబసీతో, ఓమాన్ అధికారులతో సమన్వయం చేసి మృతదేహాన్ని భారత్కు చేర్చడంలో సహకరించారు. శవపేటిక రవాణా కోసం, తెలంగాణ ప్రభుత్వ జీఏడి ఎన్నారై విభాగం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి మృతుడి స్వగ్రామం వరకు ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పించింది. అంత్యక్రియలు శుక్రవారం జరుపుతామని గ్రామ సర్పంచ్ బేగారి సాయిలు తెలిపారు.
డబ్బులు లేక పుట్టెడు దుఃఖంలో ఉన్న పరిస్థితిలో సీఎం ప్రజావాణి తమకు అన్ని రకాలుగా అండగా నిలిచిందని, అందుకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, సీఎం ప్రజావాణి బృందానికి బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
