జిల్లాలో పని చేస్తున్న అర్హులైన పాత్రికేయులకు నిబంధనల మేరకు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేసేలా చర్యలు
తీసుకుంటున్నట్లు కలెక్టర్ మరియు జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ చైర్మన్ పి.రాజాబాబు చెప్పారు. కలెక్టరేట్లో శనివారం ఆయన అధ్యక్షతన జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సమావేశం జరిగింది. అక్రిడేషన్ల మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 84 లోని నిబంధనలను జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఏ.రమేష్ ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు వివరించారు. ఈ నేపథ్యంలో అర్హత కలిగిన 290 మంది పాత్రికేయులకు తొలి విడతలో అక్రిడేషన్లు మంజూరు చేయాలని కమిటీ నిర్ణయించింది. ప్రకాశం నుంచి వేరుపడి నూతనంగా మార్కాపురం జిల్లా ఏర్పడడం, అదేవిధంగా కందుకూరు, అద్దంకి నియోజక వర్గాలు ప్రకాశం జిల్లాలో విలీనం కావడం వలన అక్రిడేషన్ల వెబ్సైట్లో ఆ వివరాలు పూర్తిస్థాయిలో మ్యాపింగ్ కాలేదు. దీనిపై ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చాక మిగిలిన దరఖాస్తులను తదుపరి సమావేశంలో పరిశీలించేందుకు కమిటీ సభ్యులు ఆమోదించారు.
ఈ సమావేశంలో కమిటీ సభ్యులైన పాత్రికేయులు ఎన్.వి.రమణ, జి.నాగేశ్వరరావు, ఎం.వెంకట రమణ, మేకపాటి మాల్యాద్రి, ఎ.సుబ్బారావు, సి.ఆనంద్ బాబు, బి.వెంకట్రావు, సిహెచ్.సుధాకర్, సి. మల్లికార్జున, కె.శ్రీనివాసులు, బి.రవికృష్ణ ప్రసాద్, ఎన్.జనార్ధన్, డి.ఎం.హెచ్.ఓ. వెంకటేశ్వర్లు, కార్మిక శాఖ సహాయ కమీషనర్ దుర్గ భవాని, హౌసింగ్ పి.డి. శ్రీనివాస ప్రసాద్, ఆర్.టి.సి. పర్సనల్ ఆఫీసర్ ఓ. శ్రీనివాసులు, డివిజనల్ పి.ఆర్.వో. దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.




