బేగంపేట మే 4 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. సోమవారం సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని 89 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ (62), షాదీముబారక్ (27) ఆర్ధిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు. ఎన్నికలకు ముందు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వాటి అమలును మరిచారని అన్నారు. ఆడబిడ్డ పెండ్లి అంటే ఆర్ధికంగా ఎంతో భారంగా ఉన్న పరిస్థితులలో పేదింటి కుటుంబాలకు చేయూత ఇవ్వాలనే ఆలోచనతో కేసీఆర్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు. ఈ కార్యక్రమం క్రింద ఒక్కో లబ్ధిదారుడి కుటుంబానికి లక్ష 116 రూపాయల ఆర్ధిక సహాయం అందించడం జరిగిందని వివరించారు. కానీ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో అదనంగా తులం బంగారం ఇస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా నేటికి ఒక్కరికైనా తులం బంగారం ఇచ్చారా అని ప్రశ్నించారు. లబ్ధిదారులు తులం బంగారం కోసం ఆశతో ఎదురుచూస్తున్నారని అన్నారు. ఇదే కాకుండా మహిళలకు నెలకు 2500 రూపాయలు, పెన్షన్ లు పెంచుతామన్న హామీలను కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేసి చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో తహసీల్దార్ పాండు నాయక్, మాజీ కార్పొరేటర్ లు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, టి. మహేశ్వరి, బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, గుర్రం పవన్ కుమార్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, నాయకులు లక్ష్మీపతి, నరేందర్, శేఖర్, కొండాపురం మహేష్ యాదవ్, ప్రేమ్, కుమార్ యాదవ్, ఆరీఫ్, కొత్తూరు వెంకట్, అబ్బాస్, చంద్ర ప్రకాష్, నాగభూషణం, శాంతి కుమార్, నాగలక్ష్మి తదితరులు ఉన్నారు.

