పద్మారావునగర్,జూన్ 15:(జె ఎస్ డి ఎం న్యూస్) : యువతలో ప్రజాస్వామ్య విలువలు పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, ‘మై భారత్’ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ‘వికసిత్ భారత్ యువ పార్లమెంట్ 2026’ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మార్గదర్శకత్వంలో జూన్ 15 నుండి 17 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. జూన్ 16న పార్లమెంట్ సెంట్రల్ హాల్లో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ సమావేశాలను అధికారికంగా ప్రారంభించనున్నారు.
ఈ జాతీయ స్థాయి పోటీలకు తెలంగాణ తరఫున ముగ్గురు యువతులు ఎంపికై సత్తా చాటారు. హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి, ఖమ్మం జిల్లాకు చెందిన కనకపూడి అఖిల (ప్రథమ), జగిత్యాల జిల్లాకు చెందిన జాధవ్ ప్రగతి (ద్వితీయ), హనుమకొండ జిల్లాకు చెందిన బి. సంధ్యారెడ్డి (తృతీయ) జాతీయ వేదికకు అర్హత సాధించారు. మూడు రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో పార్లమెంటరీ చర్చలు, నూతన పార్లమెంట్ భవన సందర్శనతో పాటు జూన్ 17న అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించనున్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో యువతను భాగస్వాములను చేసేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు.


