హైదరాబాద్ జూన్ 21:(జె ఎస్ డి ఎం న్యూస్) :తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి జన్మదిన వేడుకలు బంజారాహిల్స్లోని ఆమె నివాసంలో అత్యంత అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, జీహెచ్ఎంసీ మాజీ కార్పొరేటర్లు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యంగా మహిళలు భారీగా తరలివచ్చి ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఫాదర్స్ డే, తన పుట్టినరోజు ఒకేరోజు కావడంతో చైర్పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి ముందుగా తన తండ్రి, ప్రముఖ నేత కె. కేశవరావుతో కేక్ కట్ చేయించి ఆయనకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహిళా కమిషన్ కార్యదర్శి, సిబ్బంది ఆధ్వర్యంలో ఆమెను ఘనంగా సన్మానించి కేక్ కట్ చేయించారు.
ఈ వేడుకల్లో ఒక వినూత్నమైన ఘట్టం చోటుచేసుకుంది. చైర్పర్సన్కు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వారంతా సాధారణంగా ఇచ్చే బొకేలు, శాలువాలు, పూలదండలకు బదులుగా నిరుపేద విద్యార్థులకు ఉపయోగపడేలా నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, స్కూల్ బ్యాగులను బహుమతిగా అందించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ వినూత్నమైన ఆలోచన పట్ల చైర్పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి తీవ్ర ఆనందం వ్యక్తం చేశారు. జన్మదిన వేడుకల పేరిట చేసే ఖర్చులు వృధా కాకుండా, సమాజంలో కొంతమందికైనా ఉపయోగపడేలా ఉండటమే నిజమైన వేడుక అని ఆమె వ్యాఖ్యానించారు. అనంతరం వేడుకలకు వచ్చిన పుస్తకాలు, విద్యా సామగ్రిని బస్తీల్లోని నిరుపేద విద్యార్థులకు ఆమె చేతుల మీదుగా పంపిణీ చేశారు.

