ఎల్ నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేలా ద్విముఖ వ్యూహంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు స్పష్టం చేశారు. ఈ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. వ్యవసాయ, దాని అనుబంధ శాఖల అధికారులతో మంగళవారం ప్రకాశం భవనంలో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎల్ నినో వలన ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెప్తున్న నేపథ్యంలో వరి సాగు చేస్తున్న రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లించాలని చెప్పారు. తద్వారా వారి జీవనోపాధికి ఇబ్బంది
లేకుండా చూడడంతో పాటు జిల్లా జీ.డీ.పీ. మరియు జీ.వీ.ఏ. తగ్గకుండా చూడవచ్చు అన్నారు. జిల్లాలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా 6700 లకు పైగా ఎకరాలను గుర్తించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీనిపై ఆయన మాట్లాడుతూ వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు, వాటిలో అంతర పంటలను సాగు చేయడము ద్వారా ఏటా వస్తున్న ఆదాయానికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న విషయాన్ని రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రైతు సేవా కేంద్రాల వారీగా సమావేశాలు నిర్వహించి ఈ విషయాలను తెలియజేయాలని దిశా నిర్దేశం చేశారు. వారికి అవసరమైన విత్తనాలను అందజేయాలన్నారు. తక్కువ నీటి వినియోగంతో ఉద్యాన పంటల సాగుకు ముందుకు వస్తున్న రైతులకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం అందించాలన్నారు. ప్రస్తుత పరిస్థితులలో తాగునీటి కోసం చెరువులను నింపేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో చెరువులు, బోర్లు కింద సాగు చేయవద్దని రైతులకు చెప్పాలన్నారు. ఆయా బోర్లు ఉన్న ప్రాంతాలలో భూగర్భ నీటిమట్టం ఏ స్థాయిలో ఉన్నదో అంచనా వేయాలని అధికారులకు కలెక్టర్ చెప్పారు. చేపల వేట కోసం చెరువులలోని నీటిని విడుదల చేస్తే ఊరుకోబోమన్నారు. త్రాగునీటిని చేపల చెరువులకు మళ్ళించినా, అక్రమంగా సాగుకు వినియోగించినా కఠిన చర్యలు తప్పవన్నారు. పశు గ్రాసానికి కూడా కొరత లేకుండా చూడాలని, పశుగ్రాసం క్రయవిక్రయాల కోసం సమన్వయం చేసేలా ప్రత్యేక మొబైల్ యాప్ ను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. వ్యవసాయ సీజన్ ఊపందుకోనందున కూలీలకు వి.బి.జి.రాంజీ పథకం కింద ఉపాధి కల్పించాలని కలెక్టర్ చెప్పారు. ఎల్ నినో ప్రభావం జిల్లాపై పడకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు.
ఈ సమావేశంలో డ్వామా పిడి జోసఫ్ కుమార్, జిల్లా పశుసంవర్ధక అధికారి రవికుమార్, మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఎస్.ఈ. వరలక్ష్మి, ఆర్. డబ్ల్యు. ఎస్. ఎస్. ఈ. నాగేశ్వరరావు, జిల్లా ఉద్యాన అధికారి గోపీచంద్, ఏపీఎంఐపి పిడి శ్రీనివాసులు, ఆత్మ పి.డీ. రత్న మంజుల, ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ సుభాషిణి, భూగర్భ నీటి వనరుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


