బేగంపేట ఏప్రిల్ 13(జె ఎస్ డి ఎం న్యూస్ ):
సనత్ నగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి చేసి ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకున్నానని మాజీమంత్రి, సనత్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం పద్మారావు నగర్ పార్క్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సి సి కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి
లో సనత్ నగర్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలపాలనే లక్ష్యంతో పని చేశానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కోట్లాది రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి పనులు చేపట్టి నియోజకవర్గ పరిధిలోని ప్రజలు ఎదుర్కొంటున్న అనేక దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించినట్లు వివరించారు. పద్మారావు నగర్ పార్క్ లో కూడా అన్ని రకాల అభివృద్ధి పనులు చేపట్టి అద్భుతంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఒకప్పుడు ఎంతో అద్వాన్నంగా ఉన్న పద్మారావు నగర్ పార్క్ లో నేడు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించిన ఫలితంగా పార్క్ కు వచ్చే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందన్నారు. పార్క్ సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకొస్తూ పార్క్ అభివృద్ధి కి కృషి చేస్తున్న పార్క్ కమిటీ సభ్యులను అభినందించారు. పార్క్ లో అసాంఘిక కార్యకలాపాలు, ఆకతాయిల ఆఘడాలను అరికట్టడానికి పార్క్ లో సొంత ఖర్చులతో సి సి కెమెరాల ఏర్పాటు కోసం ముందుకొచ్చిన వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాల్ రెడ్డి ని అభినందించారు. అనంతరం పార్క్ వద్ద ముక్కా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్మ హేమలత, పార్క్ కమిటీ సభ్యులు చంద్రశేఖర్, లాయక్, వీ సి రావు, జి కే రావు, కృష్ణారావు, బి ఆర్ ఎస్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు ఏసూరి మహేష్, వెంకటరమణ, అంబులెన్స్ సురేష్, శ్రీకాంత్ రెడ్డి, మహేందర్ గౌడ్, గజ్జెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


