పొగాకు రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్నీ చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు.
మంగళవారం జిల్లా కలెక్టర్
తమీమ్ అన్సారియా, మద్దిపాడు మండలం, గార్లపాడు గ్రామంలో గల పొగాకు కొనుగోలు కేంద్రంను సందర్శించి, పొగాకు కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా పొగాకు కొనుగోలు విధానాన్ని గురించి పొగాకు రైతులు మరియు మార్క్ ఫెడ్ అధికారుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, రైతులతో మాట్లాడుతూ… ఎన్ని ఎకరాల్లో పొగాకు పంట వేసారు, ఎకరాకు ఎంత దిగుబడి వచ్చింది, కొనుగోలు కేంద్రంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. రైతులు తెచ్చిన బేళ్లను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని పొగాకు రైతులు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. పది ఎకరాల్లో పొగాకు సాగు చేపట్టడం జరిగిందని, ఎకరాకు 10 నుండి 12 క్వింటాళ్ల పంట దిగుబడి వచ్చిందని, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నామని, ఆదుకోవాల్సిన అవసరం వుందని నాగులుప్పలపాడు మండలం, ముప్పాళ్ళ గ్రామానికి చెందిన రైతు, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బందులు కలుగకుండా పొగాకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… పొగాకు రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్నీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, రైతుల వద్ద ఉన్న నల్లబర్లి పొగాకును మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్, రైతులకు తెలియచేశారు.
జిల్లా కలెక్టర్ వెంట మార్క్ ఫెడ్ డిఎం హరికృష్ణ, మద్దిపాడు తహసిల్దార్ ఆదిలక్ష్మి, ఎంపిడి ఓ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

