వైసీపీ 5 ఏళ్ల పాలనలో జరగని అభివృద్ధి, సంక్షేమం మేం కూటమి ఏడాది పాలనలోనే చేశామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఆదివారం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం మర్లపాడులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డా.స్వామి ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచుతూ ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేస్తున్నాం.ఫించన్ రూ.వెయ్యి పెంచడానికి జగన్ కి 5 ఏళ్లు పడితే…చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఒక్క సంతకంతో పింఛన్ రూ.4 వేలకు పెంచారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇచ్చాం. మహిళలకు ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించబోతున్నాం. ఈ నెలలోనే రైతులకు అన్నదాత సుఖీభవ అందజేస్తాం. మెగా డీఎస్సీతో 13 వేల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసాం, కానీ జగన్ గత 5 ఏళ్ల పాలనలో కనీసం ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేసిన పాపాన పోలేదు. చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్ తో పేదల ఆకలి తీర్చితే జగన్ అన్న క్యాంటీన్ రద్దు చేసి పేదల కడుపు కొట్టారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లు ప్రారంభించి పేదల ఆకలి తీర్చుతున్నారు. పి 4 తో రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పని చేస్తున్నారని మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు.


