హైదరాబాద్ ,ఏప్రిల్ 28,(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర విభజన చట్టం 2014 సెక్షన్ 95 ప్రకారం ఏపీకి చెందిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నిర్వహించిన దూరవిద్య విధానం ద్వారా వివిధ కోర్సులు పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక లక్ష ఇరవై నాలుగు వేల 524 మంది భవిష్యత్తును కాపాడాలని కోరుతూ విద్యార్థులు ” సీఎం ప్రజావాణి “లో ఇంచార్జ్ డాక్టర్ జీ. చిన్నారెడ్డికి విజ్ఞప్తి చేశారు.
మంగళవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో నిర్వహించిన 217వ సీఎం ప్రజావాణికి పెద్ద ఎత్తున విద్యార్థులు తరలివచ్చారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఆయా
యూనివర్సిటీల ద్వారా ఇరు రాష్ట్రాల్లో దూరవిద్య విధానం ద్వారా విద్యార్థులకు అడ్మిషన్స్ కల్పించి వివిధ కోర్సులను పూర్తి చేసుకునే అవకాశాన్ని కల్పించాయని, తద్వారా డిగ్రీలు, పీజీలు పూర్తి చేసుకున్న తెలంగాణ విద్యార్థులకు 2021 వరకు వివిధ శాఖల్లో ఉద్యోగాలు లభించాయని వారు పేర్కొన్నారు.2022 లో తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఏ.పి. కి చెందిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య ధ్రువపత్రాలు అంగీకరించమని చెప్పడంతో కోర్టును ఆశ్రయించామని, హైకోర్టు తీర్పు కూడా తమకు అనుకూలంగా వచ్చినా ఉద్యోగ అవకాశాలలో నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య ధ్రువపత్రాలను పరిగణలోకి తీసుకునే సమస్య లేదని చెప్పడంతో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక లక్ష 24 వేల 524 మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.ఈ విషయంలో సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ.చిన్నారెడ్డి స్పందిస్తూ విద్యాశాఖ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నత అధికారులతో ఫోన్లో మాట్లాడి విద్యార్థుల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థుల న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని చిన్నారెడ్డి భరోసా ఇచ్చారు.
