పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి – జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు

             పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్  పి.రాజాబాబు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రకాశం భవనంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యత నిర్వహిస్తామంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పై కలెక్టర్ సంతకం చేశారు. అనంతరం ప్రకాశం భవనం నుంచి మినీ స్టేడియం వరకు అవగాహన ర్యాలీని ప్రారంభించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. అవకాశం ఉన్నంతవరకు నడక, ప్రజా రవాణా వ్యవస్థ, కలిసి ఒకే వాహనంలో ప్రయాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ ను వినియోగించవద్దని, కర్పన ఉద్గారాలను తగ్గించడానికి ప్రజలందరూ కృషి చేయాలని కలెక్టర్ చెప్పారు. మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గురుకుల పాఠశాలలు, కాలేజీలలో ' అనంత అరణ్య ' పేరుతో వనాల పెంపకాన్ని ప్రారంభించింది అన్నారు. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతోపాటు భావి తరాలకు కూడా ఆరోగ్యకర వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత మనందరిపైనా  ఉందన్నారు. 
             ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డిఆర్ఓ మాధురి, డీఎఫ్ఓ వినోద్ కుమార్, కాలుష్య నియంత్రణ మండలి ఈ.ఈ. విజయ్ మోహన్, ఒంగోలు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రామ్ భూపాల్ రెడ్డి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వైష్ణవి, ఇతర అధికారులు, వావ్, ఐ.టీ.సీ., సార్డ్స్ స్వచ్ఛంద సంస్థలు, భగీరథ కెమికల్స్, మున్నంగి సీ ఫుడ్స్, జెసి బయోటిక్స్ పరిశ్రమల ప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 












Leave a Reply

Your email address will not be published. Required fields are marked *