బంజారాహిల్స్,జూన్ 5 ,(జె ఎస్ డి ఎం న్యూస్) :
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12, మిథిలానగర్ సమీపంలోని సఖీ సెంటర్ ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల యాక్షన్ ప్లాన్ అమలులో భాగంగా ఈ హరిత చొరవను చేపట్టారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై, అధికారులతో కలిసి స్వయంగా మొక్కలు నాటారు.ఈ సందర్భంగా చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ పర్యావరణ సంరక్షణ అనేది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని గుర్తుచేశారు. నగరంలో పచ్చదనాన్ని పెంపొందించి, హరిత హైదరాబాద్ను తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఆమె పిలుపునిచ్చారు. 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా పర్యావరణాన్ని రక్షించే ఇలాంటి కార్యక్రమాలను మునుముందు మరింత చురుగ్గా ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. పర్యావరణ, అటవీ సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ వన మహోత్సవం ముఖ్య లక్ష్యమని ఆమె వివరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా సఖీ సెంటర్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలను నాటారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డెప్యూటీ కమిషనర్ శంకర్, సఖీ సెంటర్ ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు, మహిళలు, యువతతో పాటు పర్యావరణ ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.




