హైదరాబాద్ ఆగస్ట్ 6 (జే ఎస్ డి ఎం న్యూస్)
మహిళల భద్రత, సంక్షేమం,సాధికారతకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలనీ,మహిళలపై జరిగే వేధింపులు, నేరాల నివారణకు కట్టుదిట్టమైనచర్యలు తీసుకోవాలనీ
,తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. జనగామ లో గురువారం మహిళా కమిషన్ చైర్పర్సన్ మహిళల భద్రత రక్షణ సంక్షేమం మహిళా సాధికార దిక్కు సంబంధించిన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ
మహిళల భద్రత, సంక్షేమం, సాధికారతకు సంబంధించిన కార్యక్రమాలను మరింతసమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో మహిళల భద్రత, రక్షణ, సంక్షేమం, మహిళా సాధికారతకు సంబంధించిన
అన్ని కార్యక్రమాలు సమన్వయంతో అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.మహిళలు, బాలికలపై జరిగే వేధింపులు, గృహ హింస, లైంగిక దాడులు, సైబర్ నేరాలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.బాధిత మహిళలకు తక్షణ సహాయంఅందించడంతో పాటు వారికి చట్టపరమైన రక్షణ, కౌన్సెలింగ్, వైద్య సేవలు,పునరావాసం వంటి సేవలను ఒకే వేదికపై
అందించేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలనితెలిపారు. మహిళల నుంచి వచ్చే ప్రతి
ఫిర్యాదును అత్యంత సున్నితంగా, వేగంగాపరిష్కరించాలని ఆదేశించారు.
జిల్లాలో మహిళల రక్షణ కోసం పనిచేస్తున్న షీ టీమ్స్, భరోసా కేంద్రం, సఖి కేంద్రం, జిల్లా న్యాయ సేవల సంస్థల సేవలను ప్రజలకు విస్తృతంగా తెలియజేసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రతి మహిళలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొంటూకుటుంబం, విద్యాసంస్థలు, సమాజంలో మహిళల పట్ల గౌరవభావం పెంపొందేలా నిరంతర అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.గర్భస్థ శిశువు లింగ
నిర్ధారణకు పాల్పడే స్కానింగ్ కేంద్రాలపై నిరంతర తనిఖీలు నిర్వహించాలని పోలీసు శాఖ అధికారులను ఆదేశించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
మహిళలు, బాలికల భద్రతకుసంబంధించిన ప్రతి అంశాన్ని అత్యంతప్రాధాన్యతతో పరిగణిస్తూ, పరిష్కరించాలన్నారు.అనంతరం బాధితులసమస్యలను విని
పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ), డీడబ్ల్యూఓ బెన్షాలోమ్ , మహిళా కమిషన్ సభ్యులు కాసోజు శంకరమ్మ, చిట్యాల శ్వేత , శశికళ యాదవ్ రెడ్డి, కుమారి సదాలక్ష్మి, ఎన్. రాధాబాయి , కార్యదర్శి బి. పద్మజా రమణ , కమిషన్ సిబ్బంది, ఏసీపీలు భీం శర్మ , నర్సయ్య, అదనపు డీసీపీ బాలస్వామి, వెంకటరమణ, ఏపీడీ నూరుద్దీన్, జిల్లా న్యాయ సేవల సంస్థ, షీ టీమ్స్, భరోసా కేంద్రం, సఖి కేంద్రం, పోలీసు శాఖ, షీ టీమ్స్ తదితర అధికారులు పాల్గొన్నారు.

