హైదరాబాద్ ఆగస్ట్ 6 (జే ఎస్ డి ఎం న్యూస్) : ప్రమాదాల్లో వెన్నెముక దెబ్బతిని నడవలేని దివ్యాంగులకు ప్రస్తుతం చెల్లిస్తున్న పెన్షన్ ను రూ. 4,016 నుంచి రూ. 15,000 లకు ఏ.పీ. రాష్ట్రంలో మాదిరిగా పెంచాలని కోరుతూ ఆ దివ్యాంగులు మూడు చక్రాల సైకిల్స్ పై సీఎం ప్రజావాణిలో ఇంచార్జ్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి కే. విద్యాసాగర్ లకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు దరఖాస్తు అందజేశారు.
శుక్రవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో నిర్వహించిన 245వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో పెద్ద ఎత్తున వెన్నెముక దెబ్బతిన్న దివ్యాంగులు మూడు చక్రాల సైకిల్స్ పై వచ్చారు.
ఈ విషయంపై స్పందించిన చిన్నారెడ్డి సంబంధిత సెర్ప్ శాఖ ద్వారా ముఖ్యమంత్రికి ప్రత్తిపాదనలు పంపే విధంగా చర్యలు తీసుకుంటామని ఆ దివ్యాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు షఫీ అహ్మద్ కు భరోసా ఇచ్చారు.
సీఎం ప్రజావాణిలో 274 దరఖాస్తులు
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన 245వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 274 దరఖాస్తులు అందాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 166, రెవెన్యూ శాఖకు సంబంధించి 30, హోం శాఖకు 13, ప్రవాసి ప్రజావాణికి 01 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 64 దరఖాస్తులు అందాయి.
ఈ కార్యక్రమంలో బహరేన్ దేశంలో రాష్ట్ర ప్రవాసులకు అన్ని రకాలుగా అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న హాస కొత్తూరు వాసి సమాజ సేవకులు కోటగిరి నవీన్ కుమార్ ను సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి కే. విద్యాసాగర్ శాలువతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఎన్ ఆర్ ఐ సలహా మండలి వైస్ చైర్మన్ మంద భీం రెడ్డి, ఏ సీ పీ ఉమేందర్, డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
