జిల్లా కేంద్రమైన ఒంగోలు త్రివర్ణ శోభితమయింది. గురువారం ఉదయం విద్యార్థులు, వివిధ శాఖల ప్రభుత్వ సిబ్బంది, ప్రజలు, స్థానిక ప్రముఖులు సుమారు 3వేల మంది జాతీయ పతాకాలను చేతబూని చేపట్టిన ర్యాలీతో ట్రంక్ రోడ్ కిక్కిరిసింది. వివిధ యూనిఫారాలు ధరించి ప్రకాశం భవనం నుంచి మినీ స్టేడియం వరకు జరిగిన మారథాన్ ర్యాలీ, వందేమాతరం నినాదాలతో సాగింది. జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు, జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి నేతృత్వంలో సాగిన ఈ ర్యాలీ ప్రజల్లో దేశ భక్తిని పెంచి స్వాతంత్ర్య సమర స్ఫూర్తిని నింపింది.
మినీ స్టేడియంలో ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే నేటి మన స్వతంత్ర భారతదేశం అన్నారు. ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇన్నేళ్ల ప్రయాణంలో ఎంతో అభివృద్ధి సాధించామన్నారు. అన్ని రంగాలలో దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు మరింత సమిష్టిగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా ప్రతి ఒక్కరం ప్రత్యేక లక్ష్యాలను నిర్దేశించుకుని వికసిత భారత్, స్వర్ణాంధ్ర – 2047 లక్ష్యాలకు అనుగుణంగా తమ వంతు బాధ్యత నిర్వహించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత చురుకైన పాత్ర పోషించాలని ఆయన సూచించారు. స్వాతంత్ర్య పోరాట విలువలను భావితరాలకు తెలిపేలా ఐదు రోజులపాటు హర్ ఘర్ తిరంగా, సెల్ఫీ, మొక్కలు నాటడం, తిరంగా ర్యాలీలు నిర్వహించడం వంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. ప్రతి ఒక్కరూ వీటిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ దిశగా పాల్గొంటామంటూ ఈ ర్యాలీలో పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ మారథాన్ ర్యాలీలో డీఆర్వో పి.వి. రమణ, జడ్పీ సీఈవో చిరంజీవి, డిఆర్డిఏ పిడి నారాయణ, డీఈవో రేణుక, డ్వామా పిడి జోసఫ్ కుమార్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్, ఐసిడిఎస్ పిడి పద్మ సునంద, హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్, స్టెప్ సీఈవో రమణ, జిల్లా స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల నోడల్ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా పర్యాటక అధికారి రవికుమార్, భూగర్భ జలవనరుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు, డిటిసి సుశీల, డి.ఎస్.పి. శ్రీనివాసరావు, ఏపీఎస్ఆర్టీసీ సూపర్వైజర్ ఫణి కుమార్, మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణయ్య, డిఎస్డివో రాజరాజేశ్వరి, యువజన వ్యవహారాల అధికారి నరసింహరావు, తదితరులు పాల్గొన్నారు.




