ఒంగోలు. సెప్టెంబర్ 8 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా డప్పు, చర్మకారుల పెన్షన్లకు అప్లై చేసుకునేందుకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని, మాదిగ సంక్షేమ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కొమ్ము సుజన్ మాదిగ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఒంగోలులోని ఎం ఎస్ పి ఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, నూతనంగా పింఛన్ల కొరకు దరఖాస్తులు నమోదు చేసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ డప్పు, మరియు చర్మ కారులు చేతివృత్తులపై ఆధారపడిన వారికి పింఛన్లు కొరకు నమోదు చేసేందుకు, స్పష్టమైన మార్గదర్శకాలను గ్రామ సచివాలయాలకు అందించకపోవడంతో, ఆ వృత్తిని నమ్ముకున్న పేద కుటుంబాలు అయోమయానికి గురయ్యారని సుజన్ మాదిగ తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా, ఈ రెండు వృత్తులు చేపట్టే వారిని ఎంపిక చేసే విధానాన్ని స్పష్టంగా తెలియజేయక పోవడం ద్వారా, వారు సులువుగా దరఖాస్తులు చేసుకోలేక పోతున్నారని, స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకుండా వారం రోజులలో దరఖాస్తులు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్పి ఉన్నారని, కానీ ఈ రెండు వృత్తుల వారికి స్పష్టమైన మార్గదర్శకాలని ఇవ్వకుండా ఉండటంపై, ఆ వృత్తిని నమ్ముకున్న వృత్తిదారులు ఆవేదన చెందుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వానికి మాదిగ ,మాదిగ ఉప కులాల అందరము ఓట్లు వేసి గెలిపించామని, ఈ సామాజిక వర్గం వారు మాత్రమే డప్పులు కొట్టడం మరియు చెప్పులు కుట్టడం ద్వారా జీవనాన్ని కొనసాగిస్తున్నారని, వారికి అందించే పెన్షన్ మంజూరులో స్పష్టమైన ఆదేశాలను సత్వరమే అందజేసి వారి జీవన భృతిని తోడ్పాటు అందించాలని సుజన్ మాదిగ కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెస్ పిఎస్ నాయకులు గద్దె త్యాగరాజు,అప్పారావు,జయరాజు,నారాయణ,,కొలకలూరి.బాలాజీ మాదిగ, సింగయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.
