తాళ్లూరు పొలంలో పనిచేస్తున్న తండ్రికి ఉదయం పూట అన్నం క్యారేజిని, వ్యవసాయ పనులకు అవసరమైన ట్రాక్టర్ ను తీసుకువెళ్తూ ఓ యువ ఇంజనీర్ శుక్రవారం ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన చోటు చేసుకున్నది. ఈ దుర్ఘటన తాళ్లూరు మండలం లక్కవరం గ్రామంలో చోటు చేసుకున్నది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం… తాళ్లూరు మండలం లో ని లక్కవరం గ్రామానికి చెందిన తూము వెంకట సుబ్బారెడ్డి కుమారుడు సాయి కల్పనా రెడ్డి (22) ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఇటీవల వారం క్రిందం ఇంటికి వచ్చాడు. ఉన్నత విద్యాభ్యాసం చేసేందుకు గేటు తయారు అవుతున్నాడు. తండ్రి పొలంలో పనులు చేస్తూ ఉండగా శుక్రవారం ఉదయం ట్రాక్టర్తో పాటు అన్నం క్యారేజి తీసుకుని నివాసం నుండి ట్రాక్టర్పై బయలు దేరాడు. అయితే రావి కుంట వాగు వద్దకు వెళ్లే సరికి ట్రాక్టర్పై ఉన్న క్యారేజి ప్రక్కకు వరగటంతో దానిని సరిచేసే క్రమంలో ట్రాక్టర్ అదుపు తప్పి రావికుంట వాగులో పడిపోయినది. దీంతో ట్రాక్టర్ క్రింద పడి యువకుడు మృతి చెందాడు. వెంకట సుబ్బారెడ్డి దంపతులకు ఇరువురు సంతానం కాగా, కుమార్తె సౌమ్య, మృతుడు సాయి కల్పనా రెడ్డి. చేతికి అంది వచ్చిన కుమారుడు మృతి చెందటంతో తల్లిదండ్రులను ఓదార్చటం బంధు మిత్రుల వల్ల కాలేదు. ఎఎస్పై సంఘటన స్థలాన్ని పరిశీలించి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోష్టు మార్టమ్ నిమిత్తం దర్శి సీహెచ్సీకి తరలించారు.

