ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలెం గ్రామానికి చెందిన ముత్తుకూరు శ్రీదేవి (43) అనే మహిళ మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని వెల్లంపల్లి సమీపంలో పైపుల ఫ్యాక్టరీ ఎదురుగా సోమవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినారు.
ఈ నేపథ్యంలో హత్య జరిగిన నేరస్థలాన్ని ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం నేరస్థలానికి చుట్టుపక్కల పరిశీలించి, హత్య జరిగిన విధానం, నేరం జరిగిన తీరు తదితర అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది సేకరించిన ఆధారాలను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. నేరస్థలంలో లభించిన ప్రతి ఆధారాన్ని జాగ్రత్తగా భద్రపరచాలని అధికారులను ఆదేశించారు. నేరం జరిగిన తీరును బట్టి మృతురాలి గత చరిత్ర, ఆమెకు సంబంధించిన వ్యక్తులు, అనుమానితుల వివరాలపై అన్ని కోణాల్లో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని సూచించారు. కేసు దర్యాప్తు లో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను అధికారులకు వివరించారు, కేసును త్వరితగతిన ఛేదించేందుకు అవసరమైన పలు కీలక సలహాలు, సూచనలు అందించారు. హత్య జరిగిన వెంటనే క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దింపామని, ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు.
జిల్లా ఎస్పీ వెంట ఒంగోలు డీఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఒంగోలు రూరల్ సీఐ శేషగిరిరావు, మద్దిపాడు ఎస్సై వెంకట సూర్య, కొత్తపట్నం ఎస్సై సుధాకర్, ఎన్జీ పాడు ఎస్సై మహేంద్ర ఉన్నారు.

