తాళ్లూరు- అవిశన పాలెం మట్టి రోడ్లో ఇసుక టిప్పర్ బోల్తా కొట్టిన ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. పోలవరం ఇసుక రేవు నుండి ఇసుకను తీసుకువెళ్తున్న టిప్పర్ ప్రమాద వశాత్తు మట్టి రోడ్లో జారీ ప్రక్కను ఉన్న గుంటలో పడి పోయినది. దీంతో డ్రైవర్ ప్రక్కను ఉన్న డోర్ బలంగా గుద్దుకుని డ్రైవర్ పాటి బండ్ల పెద సుబ్బారావు (44) అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న దర్శి సీఐ రామకోటయ్య, ఎస్సై ప్రేమ్ కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుని కుమారుడు అజయ్ బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తరచూ బోల్తా కొట్టుచున్న టిప్పర్లు… ఆందోళనలో రైతులు….
చిలకలేరు నుండి నిత్యం గ్రామీణ రోడ్లలో అధిక లోడ్లో తిరుగుతున్న ఇసుక టిప్పర్ల వలన ఇప్పటికే రోడ్లు అన్ని గోతుల మయం అయ్యాయి. ఇదే విధంగా బ్రిడ్జిలు కూడ కుంగిపోతున్నాయి. దీంతో ఇటీవల తరచూ టిప్పర్లు బోల్తా కొట్టుచున్నాయి. గత నెలలో దోర్నపు వాగు బ్రిడ్జి వద్ద టిప్పర్ బోల్తా కొట్టినది. అదృష్ట వశాత్తు ప్రాణ నష్టం జరగలేదు. ప్రస్తుతం మరో టిప్పర్ బోల్తా కొట్టిన సంఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. రైతులు గమనిస్తున్న సమయంలోనే టిప్పర్ ప్రక్కకు వెళ్లి బొల్తా కొట్టటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాత్రుళ్లు, పగళ్లు కూడ ఇలా టిప్పర్లు తిరుగుతుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

