తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబును కస్టడీకి కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్పై విజయవాడ ఏసీబీ కోర్టులో బుధవారం విచారణ ముగిసింది. వాదనలు విన్న న్యాయమూర్తి గురువారం ఉదయం 11.30 గంటలకు తీర్పు వెలువరిస్తామని ప్రకటించారు..
చంద్రబాబును ఐదు రోజుల పాటు కస్టడీకి కోరుతూ సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబును అన్ని ఆధారాలతోనే అరెస్టు చేశారన్నారు. ‘ఈ కేసుతో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ మరింత విచారించాలి. ఈ కేసులో రికవరీ కంటే కుట్ర కోణాన్ని వెలికితీయడం ముఖ్యం. చంద్రబాబును పూర్తిస్థాయిలో విచారిస్తేనే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. స్కిల్ కేసులో నిధులు ఎక్కడెక్కడికి వెళ్లాయో సమాచారం ఉంది. కేసుకు సంబంధించి పూర్తి వివరాలు రాబట్టాల్సి ఉంది” అని సుధాకర్ రెడ్డి వాదించారు.