పులుల సంఖ్యతోపాటు అడవులలో అవి సంచరిస్తున్న ప్రాంతం కూడా పెరుగుతున్నందున ప్రభావిత ప్రాంతాలలో నివసిస్తున్న గిరిజనులను ఇతర ప్రాంతాలకు తరలించే అంశాన్ని పరిశీలించాలని జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ చెప్పారు. అటవీ ప్రాంతాలలో నివసిస్తున్న గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి అంశాలపై సంబంధిత అధికారులతో సోమవారం కలెక్టరెట్లో ఆయన సమీక్షించారు. గిరిజనులను రీలొకేట్ చేయడంలో వారికి అవసరమైన జీవనోపాధి చూపి, స్థిర నివాసం కల్పించాలన్నారు. ఈ విధంగా మధ్యప్రదేశ్లోని సాత్పూరా ప్రాంతంలో అనుసరించిన విధానాలను ఇక్కడ కూడా అమలు చేసే విషయాన్ని పరిశీలించాలని ఆయన స్పష్టం చేశారు. ఆర్.ఓ.ఎఫ్.ఆర్. పట్టాలు ఇచ్చిన స్థలాలకు సంబంధించి ఎలాంటి వివాదాలు లేకుండా చూడాలని కలెక్టర్ చెప్పారు. అటవీ, రెవెన్యూ అధికారులు మరోసారి సంయుక్తంగా సర్వే చేయాలని ఆయన ఆదేశించారు. రిజర్వ్ ఫారెస్ట్ భూములలో పట్టాలు మంజూరు చేసినట్లు గుర్తిస్తే వాటిని రద్దు చేసి గిరిజనులకు రెవెన్యూ భూములను మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో మార్కాపురం డిప్యూటీ డైరెక్టర్ (ఫారెస్ట్) జి. విఘ్నేష్ అప్పావు, మార్కాపురం సబ్ కలెక్టర్ సేతు మాధవన్, ఏ.ఎస్.పి. నాగేశ్వరరావు, డి.ఆర్.ఓ. శ్రీమతి. ఆర్. శ్రీలత, డి.ఎఫ్.ఓ. పి.సునీత, డిప్యూటీ డైరెక్టర్ (పి.టి. గిద్దలూరు) వై. నరసింహులు, జిల్లా – గిరిజన సంక్షేమ అధికారి జగన్నాధరావు, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
