రామాయపట్నం ఓడరేవు నిర్మాణంతో అభివృద్ధిపరంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల ముఖ చిత్రం పూర్తిగా మారనున్నదని రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆయన నెల్లూరు నుంచి విజయవాడ వెళుతూ రామాయపట్నం ఓడరేవు నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఒంగోలు లో ఎన్.ఎస్.పి. గెస్ట్ హౌస్ లో విలేకరులతో ఆయన మాట్లాడారు.
ఈ ఓడరేవు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. డిసెంబరు నాటికి మొదటి బెర్త్ పూర్తవుతుందని నిర్మాణ సంస్థ ప్రతినిధులు చెప్పినట్లు ఆయన తెలిపారు. ఈ ఓడ రేవు నిర్మాణం వలన ఎలాంటి సారములేని భూముల విలువ కూడా పెరిగినట్లు స్థానికులు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. ఈ పోర్టుకు సమీపంలోనే నిర్మిస్తున్న జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు కూడా 95 శాతం పూర్తయ్యాయన్నారు. రామాయపట్నంలో పోర్ట్ నిర్మించాలన్నది ఈ ప్రాంత వాసుల చిరకాల ఆకాంక్ష అని, వీటి నిర్మాణంతోపాటు గతంలో ఎన్నడూ లేని రీతిలో తీర ప్రాంతం మొత్తాన్నీ అభివృద్ధి చేసేలా ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవడం సంతోకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఫిషింగ్ హార్బర్ లు, ఓడరేవుల నిర్మాణంతో తీర ప్రాంతాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వంలో ఏమైనా లోపాలు ఉంటే ఎత్తిచూపడంలో తప్పులేదుగానీ, ప్రభుత్వం చేపట్టిన ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా మీడియా నిష్పక్షపాతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. నేటి పాత్రికేయులకు, భావి తరాలకు కూడా తెలిసేలా గత వంద సంవత్సరాలలో సమాజాన్ని ప్రభావితం చేసిన సీనియర్ జర్నలిస్టుల జీవిత చరిత్రతో ప్రత్యేక పుస్తకాన్ని రాష్ట్ర మీడియా అకాడమీ తరఫున ముద్రిస్తున్నట్లు శ్రీ కొమ్మినేని శ్రీనివాసరావు చెప్పారు. ముట్నూరి కృష్ణారావు, కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు, కోటంరాజు రామారావు, కాసా సుబ్బారావు, జి.కె.రెడ్డి తదితర ప్రముఖుల జీవిత చరిత్రలను ఇందులో పొందుపరుస్తున్నట్లు తెలిపారు. నవంబరు మొదటి వారంలో ఈ పుస్తకాన్ని విడుదల చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వివిధ రంగాలలోని ప్రముఖులతో ప్రతి శనివారం ఉదయం 9గంటలకు మీడియా అకాడమీ తరఫున ఆన్లైన్ తరగతులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఆన్లైన్ అవగాహన క్లాసులను వినియోగించుకోవాలని విలేకరులకు ఆయన సూచించారు.
రామాయపట్నం ఓడరేవు నిర్మాణంతో అభివృద్ధితో నెల్లూరు, ప్రకాశం జిల్లాల ముఖ చిత్రం పూర్తిగా మారనున్నాయి -రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాస్
26
Sep