తన రచనల ద్వారా సమాజంలోని అసమానతలను రూపుమాపడానికి కృషి చేసిన మహాకవి గుర్రం జాషువా అని జాయింట్ కలెక్టర్ కె. శ్రీనివాసులు అన్నారు. గుర్రం జాషువా 128వ జయంతిని పురస్కరించుకొని గురువారం కలెక్టర్ కార్యాలయంలోని ఆయన విగ్రహం ఉన్న ప్రాంగణంలో జాషువా చిత్రపటానికి ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత, మున్సిపల్ కమిషనర్ ఎం. వెంకటేశ్వరరావుతో కలిసి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ మరియు గుర్రం జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ… నాటి సమాజంలోని అసమానతలు, అస్పృస్యతలపై తమ రచనల ద్వారా జాషువా చైతన్యం తీసుకొని వచ్చారని కొనియాడారు. గబ్బిలం, ఫిరదౌసి వంటి ఎన్నో రచనల ద్వారా ప్రజల ఆలోచనలలో జాషువా మార్పు తీసుకువచ్చారన్నారు. మేయర్ మాట్లాడుతూ… సమాజంలోని అసమానతలపై అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు జాషువా రచనల స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పధకాలు ప్రవేశ పెట్టారని అన్నారు. బలహీన వర్గాల ప్రజలు రాజకీయంగానూ ముందడుగు వేసేలా ముఖ్యమంత్రి పెద్ద సంఖ్యలో పదవులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న జాషువా విగ్రహ ఏర్పాటు పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ కలెక్టరేట్లో జాషువా విగ్రహం ఏర్పాటు కోసం మొత్తం రూ.16.75 లక్షలు అవుతుండగా వాటిలో రూ. 5 లక్షలను మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కేటాయించినట్లు చెప్పారు. గుర్రం జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి అద్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాట్లాడుతూ జాషువా జయంతిని ప్రభుత్వ కార్యక్రమంగా జరపాలని ఉత్తర్వులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టరేట్లో జాషువా కాంస్య విగ్రహ ఏర్పాటు, గార్డెనింగ్ పనులు నవంబర్ నాటికి పూర్తి చేసి జిల్లా కలెక్టర్, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధుల సమక్షంలో విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలను భారీ స్థాయిలో నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉదయశ్రీ, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, కవులు, దళిత ప్రజా సంఘాల నాయకులు పాటిబండ్ల ఆనందరావు, కత్తి కళ్యాణ్, అంగలకుర్తి ప్రసాద్, రావినూతల కోటి, ఎండ్లూరి రవికుమార్, ఎజ్రా శాస్త్రి, ముప్పవరపు గోపి,
జి.వెంకటేశ్వర్లు, కొమ్మూరి గరటయ్య, పానుగంటి షాలేమ్రాజు, మున్నంగి లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు .
