పంటల సాగులో . . మేలు రకమైన విత్తనాలు, సరియైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొందవచ్చని జిల్లా వ్యవసాయాధికారి ఎస్. శ్రీనివాసరావు అన్నారు. స్పందన సమావేశపు మందిరంలో గురువారం దర్శి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రబీ పంటల సాగులో రైతులు పాటించాల్సిన మెలుకువలపై వ్యవసాయశాఖ అధికారులకు, సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ… దర్శి కృషి విజ్ఞాన కేంద్రం వారు అందిస్తున్న సూచనలు, సలహాలు రైతులకు తెలియజేసి మంచి దిగుబడులకు సహకరించాలని కోరారు. దర్శి కెవికే శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ఏవి.ఎస్ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ… సరియైన సమయంలో తగిన సస్యరక్షణ చర్యలకు కేవికే శాస్త్రవేత్తలు సూచిస్తారని అవి తప్పనిసరిగా రైతులకు చేరేలా కృషి చెయ్యాలని కోరారు. దర్శి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ప్రమీల రాణి మాట్లాడుతూ ….వివిధ పంటలలో తక్కువ ఖర్చుతో కలుపు నివారణ చర్యలను సూచించారు. శాస్త్రవేత్త డాక్టర్ టి. వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ రబీలో సాగు చేసే పంటలైన శనగ, మినుములకు చెందిన అనువైన కొత్త వంగడాలు సూచించారు. కెవికే కీటక శాస్త్రవేత్త ఎం. జాహ్నవి మాట్లాడుతూ… రబీ కాలంలో సాగు చేయు ప్రధాన పంటలు ఆశించే ప్రధాన పురుగులు, తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఒంగోలు ఎడీఏ బి. రమేష్ బాబు మాట్లాడుతూ ఈ పంటకు నమోదుకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు విపులంగా తెలిపారు. శింగరాయకొండ ఏడీఏ ఈ నిర్మల కుమారి మాట్లాడుతూ… రైతు భరోసా కేంద్రం నుండి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సరఫరా అవుతున్నాయని వాటిని రాయితీపై ఇచ్చే శనగలకు పంపిణీలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 11 మంది వ్యవసాయాధికారులు, పది మంది ఎఈఓలు, 170 మంది ఆర్.బి.కె సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.


