పొగాకు సాగు చేయు రైతులు మొదటగా ఆరోగ్యకరమైన పొగ నారును ఎంపిక చేసుకుని నాటాలని పొగాకు బోర్డు ఆర్ఎం లక్ష్మణరావు కోరారు. జిల్లాలో పలు ప్రాంతాలలో నాటుతున్న పొగనాట్లను, పొగనారు క్షేత్రాలను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతులు ముమ్మరంగా పొగనాట్లు సాగిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే 25 వేల ఎకరాలలో పొగ నాట్లు పూర్తి అయ్యాయని చెప్పారు. ఒంగోలు రీజయన్ పరిధిలో 26,600 మంది రైతులకు 20,200 బ్యారన్లలో 1,25,687 ఎకరాలలో అధికారిక ఉత్పత్తి పరిమాణం 77 మి.కేలుగా ప్రస్తుతం నిర్ణయించినట్లు చెప్పారు. రైతులు వ్యవసాయ ఖర్చులు తగ్గించుకుని నాణ్యమైన పొగాకు ఉత్పిత్తి చెయ్యాలని కోరారు. కార్యక్రమం వేలం నిర్వాహణాధికారులు శ్రీనివాసరావు, రామక్రిష్ణ, జె తులిసి తదితరులు పాల్గొన్నారు.
