జిల్లాలోని అన్నీ ప్రభుత్వ, ప్రవేటు కార్యాలయాల్లో “ పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం & పరిష్కార) చట్టం, 2013 “ పటిష్టంగా అమలు జరిగేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా పేర్కొన్నారు.
ఒంగోలు కలెక్టరేట్ లోని గ్రీవెన్స్ హాల్లో “పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం మరియు పరిష్కారం) చట్టం-2013” కు సంబందించి మహిళా శిశు సంక్షేమ శాఖ ఆద్వర్యంలో ఏర్పాటుచేసిన వర్క్ షాప్ లో జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి జి. దీనా పాల్గొని జ్యోతి ప్రజల్వన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా లోని అన్నీ ప్రభుత్వ, ప్రవేటు కార్యాలయాల్లో “ పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం & పరిష్కార) చట్టం, 2013 “ పటిష్టంగా అమలు జరిగేలా ప్రతి మహిళ ఈ చట్టంపై పూర్తి అవగాహన కల్గివుండాలన్నారు. ఈ చట్టం 2013లో రావడం జరిగిందని, ఈ చట్టం కింద రాష్ట్రంలో ఇప్పటివరకు 41 కేసులు మాత్రమే నమోదు కావడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఈ చట్టం పై అవగాహన లేకపోవడం, అవగాహన వుండి కూడా ధైర్యంగా వచ్చి పిర్యాదు చేయకపోవడం వంటి కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ కేసులు నమోదు అయివుండవచ్చన్నారు. ఇంటి నిర్వహణ బాధ్యతలతో పాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహిళ మంచి వాతావరణంలో సురక్షితంగా ఉద్యోగ విధులు నిర్వహించేలా ఈ చట్టం తోడ్పాటు కల్పిస్తుందన్నారు. ఏదైనా పని ప్రదేశంలో మహిళ లైంగిక వేధింపులకు గురైతే .. .. ఆ మహిళా ఉద్యోగికి అండగా నిలవాల్సిన బాధ్యత ఇతర మహిళా ఉద్యోగులు పై ఉందన్నారు. ఈ చట్టం ననుసరించి మహిళలు పనిచేసే ప్రతి చోట అంతర్గత కమిటీలు ఏర్పాటు చేసి ఉండాలని, అలా చేయనివారు తక్షణమే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
సీనియర్ సివిల్ జడ్జి జి. దీనా మాట్లాడుతూ.. … మహిళలకు రాజ్యాంగపరంగా ఇచ్చిన హక్కులను పరిరక్షించడం, పనిచేస్తున్న ప్రదేశాల్లో ఉద్యోగ భద్రతా కల్పించడం, ఉద్యోగ విధులు నిర్వర్తించడానికి సంతోషకరమైన, సురక్షితమైన వాతావరణం కల్పించడం “ పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం & పరిష్కార) చట్టం, 2013 “ యొక్క ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ప్రభుత్వ, స్వచ్చంద, క్రీడా, సహకార, విద్యా తదితర సంస్థలతో పాటు నర్సింగ్ హోమ్ లు, పరిశ్రమలు, ఆసువత్రులు, కార్పొరేషన్లు, స్వయం ఉపాధులు, బ్యాంకులు, మరే ఇతర పనిచేసే చోటనైనా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారందరిపై ఈ చట్టం వర్తిస్తుందని తెలిపారు. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం మరియు పరిష్కారాలు) చట్టంగా అధికారికంగా పిలువబడే PoSH చట్టం ఏర్పాటును 1997 లో భారత సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పుతో గుర్తించవచ్చునని దీనిని సాధారణంగా విశాఖ కేసు అని పిలుస్తారన్నారు. విశాఖ తీర్పు తర్వాత పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను పరిష్కరించడానికి ప్రత్యేకంగా ఒక సమగ్ర చట్టాన్ని రూపొందించి ఆమోదించే ప్రయత్నాలు జరిగాయని, అందులో బాగంగా 2013 డిసెంబర్ 9న POSH చట్టంగా అమల్లోకి వచ్చిందని ఆమె వివరించారు. లైంగిక వేధింపుల నిరోధక (PoSH) చట్టం ఏర్పాటు మరియు నిబంధనలు, అధికారాలు, భాద్యతలు, ఈ చట్టం ప్రకారం ఏఏ అంశాలను లైంగిక వేధింపులుగా పరిగణించబడుతుంది తదితర అంశాలను క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఈ చట్టం పటిష్టంగా అమలుకు అంతర్గత కమిటీల ఏర్పాటు ముఖ్యమన్నారు. ఈ చట్టంపై ప్రతి మహిళా పూర్తిగా అవగాహన కలిగివుండాలన్నారు.
ఐసిడిఎస్ పిడి మాధురి మాట్లాడుతూ……….. మహిళలు మరియు పిల్లల భద్రతకు, సంరక్షణకు ప్రభుత్వాలు అనేక చట్టాలను తీసుకురావడం జరిగిందన్నారు. పనిచేస్తున్న ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధకానికి తీసుకొచ్చిన (PoSH) చట్టం ఆవశ్యకతను, చట్టం అమలు గురించి వివరించారు.
ఈ సందర్భంగా లైంగిక వేధింపుల నిరోధక (PoSH) చట్టం ఏర్పాటు, నిబంధనలు, అమలు తదితర పూర్తీ వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పొదిలి సిడిపిఓ శ్రీమతి సుధామాధురి వివరించారు.
తొలుత లైంగిక వేధింపుల నిరోధక (PoSH) చట్టం అమలులో బాగంగా ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ అమరావతి జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన షీ బాక్స్ ( పిర్యాదుల బాక్స్) ను జిల్లా కలెక్టర్ త మీమ్ అన్సారియా ప్రారంభించారు.
ఈ వర్క్ షాప్ లో డిఆర్డిఏ పిడి వసుంధర, జిల్లా దివ్యాంగుల శాఖ ఎడి శ్రీమతి అర్చన, వివిధ శాఖల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు, ఐసిడిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.








