గోదాదేవి రచించిన పాశురాలు సమస్త వేదసారమని ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వేంకట శ్రీనివాసులు అన్నారు. ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానములు, ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఒంగోలులోని గాంధీరోడ్డులో గల గీతామందిరంలో తిరుప్పావై ప్రచవనాలు ప్రారంభించారు. టిటిడి ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఉపన్యాసాకులు పొన్నూరు వేంకట శ్రీనివాసులు మాట్లాడుతూ గోదాదేవి ఆవిర్భావం, శ్రీకృష్ణుడిని పొందేందుకు ఆండాళ్ గోష్టి ఆచరించిన తిరుప్పావై వ్రతం, పాశురాల ప్రాశస్త్యాన్ని వివరించారు. మొట్టమొదటి పాశురంలోని అంతరార్థాలను తన ఉపన్యాసం ద్వారా తెలిపారు. తిరుప్పావై పాశురాల పారాయణం, ప్రవచనం వినడం వలన అనన్య శేషత్వం, అనన్య భోగత్వం, అనన్య శరణత్వం లభిస్థాయని అన్నారు. సోమవారం ప్రారంభమైన ప్రవచనం నుంచి జనవరి 13వ తేదీ వరకు 30 రోజులపాటు ప్రతిరోజూ ఉదయం 9గంటల నుండి ఉంటుందని తెలిపారు. ముందుగా ఉపన్యాసులు పొన్నూరు వేంకట శ్రీనివాసులుని గీతామందిరం భక్త బృంద సభ్యులు కృష్ణ, సురేఖ, మువ్వల సుబ్బారావు, విజయలక్ష్మి, సుబ్రహ్మణ్యం, రాజేశ్వరి, అనిత, రాధ, సీత, శ్రీదేవి, చల్లా నాగేశ్వరమ్మ తదితరులు స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


